Pawan Kalyan: పవన్ కల్యాణ్ వస్తున్నారని తెలిసి ధాన్యం కొనుగోలు!: జనసేన ఆగ్రహం

  • పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన పవన్ 
  • ప్రతి గింజా కొనే వరకు జనసేన పోరాడుతుందని భరోసా
  • ధరల స్థిరీకరణ కోసం కేటాయించిన డబ్బులు ఏమయ్యాయని ప్రశ్న
Pawan Kalyan tour in east godavari district

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించి, అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. కడియం ఆవలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జనసేన ఓ ప్రకటనను విడుదల చేసింది. 

ధాన్యం కొనాలంటే పవన్ రావాలా, పంట నష్టపోతే అధికారులు తొంగి చూడలేదని రైతులు జనసేనానితో గోడు వెళ్లబోసుకున్నారని ఆ ప్రకటనలో తెలిపింది. పుస్తెలు తాకట్టు పెట్టి పంట పండించామని, మీరు వస్తున్నారంటేనే ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారని రైతులు ఆయనతో మొర పెట్టుకున్నారని వెల్లడించింది. ప్రతి గింజా కొనే వరకు జనసేన పోరాడుతుందని పవన్ రైతులకు భరోసా ఇచ్చారని తెలిపింది.

ముఖ్యమంత్రి జగన్ ధరల స్థిరీకరణ కోసం రూ.3 వేల కోట్లను ప్రకటించారని, ఆ నిధి ఏమయిందో ప్రభుత్వంలో ఉన్న వారికే తెలియాలని పేర్కొంది. వరదలు వచ్చి రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో ఆ డబ్బులు ఎక్కడ దాచుకున్నారని జనసేన ప్రశ్నించింది. ఎకరాకు రూ.30వేల నుండి రూ.40వేల ఖర్చు అయిందని, అకాల వర్షాల కారణంగా భారీ నష్టం వాటిల్లిందన్నారు. మొలకెత్తిన, తడిసిన ధాన్యాన్ని కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. 

More Telugu News