Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ ఆరోపణలపై స్పందించిన పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

  • అవినీతి జరిగిందని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపణలు
  • టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందన్న అరవింద్ కుమార్ 
  • లీజుకు బేస్ ప్రైస్ ను నిర్ణయించామని వెల్లడి
  • ఒప్పందం పూర్తయ్యాక అన్ని వివరాలు చెబుతామని వివరణ 
Arvind Kumar on ORR tender allegations

ఓఆర్ఆర్ టెండర్ విషయంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై తెలంగాణ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ బుధవారం స్పందించారు. ఈ టెండర్ పారదర్శకంగా జరిగిందని ఆయన తెలిపారు. హైవే అథారిటీ విధివిధానాల ప్రకారమే టెండర్ పిలిచినట్లు చెప్పారు. ఎన్‌హెచ్ఏఐ అనుమతి లేకుండా టోల్ ఛార్జీలు పెంచరని అన్నారు. లీజుకు బేస్ ప్రైస్ నిర్ణయించినట్లు, కానీ దానిని బయటకు చెప్పలేదని వెల్లడించారు. ఎన్‌హెచ్ఏఐ కూడా బేస్ ప్రైస్ ను వెల్లడించలేదన్నారు.

ఓఆర్ఆర్ బిడ్డింగ్ లో బేస్ ప్రైస్ కంటే ఎక్కువ వచ్చిందని చెప్పారు. బిడ్డింగ్ కోసం 142 రోజుల గడువు ఇచ్చామన్నారు. బిడ్ ఇంకా పెంచుతారా అని హెచ్1ను అడిగే వెసులుబాటు ఉందని, నిబంధనల ప్రకారం అడిగితేనే రూ.7,380 కోట్లకు పెంచినట్లు చెప్పారు. రాజకీయంగా ఏమైనా ఉండవచ్చునని, అధికారులపై ఆరోపణలు తగదన్నారు. ఒప్పందం పూర్తయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

More Telugu News