Bengaluru: విజయానికి దగ్గరగా వచ్చి పరాజయం పాలయ్యారు!

  • సున్నాకే అవుటైన విరాట్ కోహ్లీ, మాక్స్ వెల్, డుప్లెసిస్ జోరు
  • రాజస్థాన్ ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన బెంగళూరు
  • వికెట్లు ఉన్నప్పటికీ 182 పరుగులకే పరిమితమైన రాజస్థాన్
Royal Challengers Bangalore beat Rajasthan Royals by 7 runs

రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 189 పరుగులు చేసింది. 190 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులే చేసింది.

లక్ష్యఛేదనలో రాజస్థాన్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాట్స్ మన్ జోస్ బట్లర్ (0) ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. అయితే, భారీ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్ (47), దేవదత్ పడిక్కల్ (52) దూకుడుగా ఆడారు. 

కెప్టెన్ సంజు శాంసన్ కూడా ఉన్నంత సేపు దాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. శాంసన్ 15 బంతుల్లో 22 పరుగులు చేశాడు. చివర్లో ధృవ్ జురెల్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. మరో ఎండ్ లో వరుసగా వికెట్లు పడడంతో జురెల్ పోరాటం ఫలించలేదు.

బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ కీలక సమయాల్లో వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్ కు కళ్లెం వేశాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ రాజస్థాన్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. హర్షల్ పటేల్ 3 వికెట్లు తీయగా, సిరాజ్ 1, డేవిడ్ విల్లీ 1 వికెట్ తీశారు.

అంతకుముందు బెంగళూరు ఇన్నింగ్స్ లో గ్లెన్ మాక్స్ వెల్ 44 బంతుల్లో 77 పరుగులు చేయగా, డుప్లెసిస్ 39 బంతుల్లో 62 పరుగులు చేశారు. వీరు మూడో వికెట్ కు 127 పరుగులు జత చేశారు. దీంతో బెంగళూరు మంచి పరుగులు సాధించింది. 

బెంగళూరు స్టాండిన్ స్కిప్పర్ కోహ్లీ సున్నాకే అవుటయ్యాడు. యజ్వేంద్ర చాహల్ 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు ఇచ్చి, 1 వికెట్ తీశాడు. చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. అతని మొత్తం స్పెల్ లో చాహల్ కేవలం ఒక సిక్స్ మాత్రమే ఇచ్చాడు. సింగిల్ బౌండరీ కూడా ఇవ్వలేదు.

ఇది బ్యాటింగ్‌కు ఇబ్బంది లేని మైదానమని, తాను ఆస్ట్రేలియా తరఫున ఆడినప్పుడు కూడా చూశానని గ్లెన్ మ్యాక్స్ వెల్ చెప్పాడు. మంచి ఫామ్‌తో సీజన్‌లోకి వచ్చామన్నాడు. కొత్త బంతి చక్కగా స్కిడ్ అయిందని, కాబట్టి తాము దూకుడుగా ఆడామన్నాడు. చివరికి కొంచెం గందరగోళం ఏర్పడినప్పటికీ, పవర్‌ప్లేలో తాము ముగించిన విధానం పునాదిని ఏర్పరచిందన్నాడు.

చెన్నైపై టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్

ఇవాళ డబుల్ హెడర్ జరుగుతున్న నేపథ్యంలో, రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కోల్ కతా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ 10 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. 

35 పరుగులు చేసిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్... సుయాశ్ శర్మ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 50 పరుగులతోనూ, అజింక్యా రహానే 9 పరుగులతోనూ ఆడుతున్నారు. ఈ మ్యాచ్ కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా నిలుస్తోంది. 


More Telugu News