Revanth Reddy: నేను హిందువును... అబద్ధం చెబితే సర్వనాశనం అవుతా: అమ్మవారి సాక్షిగా రేవంత్ ప్రమాణం

Revanth Reddy pramanam in Bhagyalaxmi temple
షార్ట్స్‌లో చూడండి
"నేను హిందువును... దేవుడ్ని నమ్ముతాను.. అమ్మవారి సాక్షిగా చెబుతున్నాను... ఇప్పుడే పూజారి నాకు అమ్మవారి కండువా కప్పారు..  ఈ కండువా కప్పుకొని ఒట్టేసి చెబుతున్నాను.. ఇది రాజకీయం కాదు.. నా మనోవేదన.. కేసీఆర్ నుండి మేం సాయం పొందితే మేం సర్వనాశనం అవుతాం" అంటూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద ప్రమాణం చేశారు. 

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ నుండి రూ.25 కోట్లు అందాయని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈటల వ్యాఖ్యలు అవాస్తవమని చెబుతూ, రేవంత్ నేడు భాగ్యలక్ష్మి గుడి వద్ద ప్రమాణం చేశారు. ప్రమాణం అనంతరం రేవంత్ మాట్లాడారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ నుండి తాము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. గతంలో పాల్వాయి చేసిన సవాల్ కు కూడా బీజేపీ, బీఆర్ఎస్ స్పందించలేదని, ఇప్పుడు కూడా బీజేపీ వెనుకడుగు వేసిందన్నారు. 

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయని ఆరోపించారు. మద్యం పెద్ద ఎత్తున పంచారన్నారు. కానీ పాల్వాయి స్రవంతి ఒక్క రూపాయి పంచకుండా ప్రజాతీర్పు కోరిందన్నారు. ఒక్క రూపాయి ఇవ్వకుండానే తమకు పాతిక వేల ఓట్లు వచ్చాయన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసునని చెప్పారు. ఏ ఆధారం లేని వారికి దేవుడే ఆధారమని రేవంత్ పేర్కొన్నారు. ఆధారాలు చూపించాలని ఈటలకు సవాల్ విసురుతున్నామన్నారు.

ఈ తొమ్మిదేళ్లలో తనపై కక్ష పూరితంగా కేసులు పెట్టిన కేసీఆర్ తో ఎలా కలుస్తానని చెప్పారు. తన కూతురు పెళ్లికి వచ్చేందుకు కూడా ఇబ్బందులు పెట్టారన్నారు. ఈటల దేవుడిని నమ్ముతాడో లేదోనని, తాము నమ్ముతామని, అందుకే ఒట్టు వేశానని చెప్పారు. కేసీఆర్ నుండి సాయం పొంది ఉంటే తాము సర్వనాశనం అవుతామన్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Etela Rajender
BJP
Congress

More Telugu News