Nagababu: పార్టీలో ఉన్న చిన్న చిన్న విభేదాలను పరిష్కరించుకుంటాం: నాగబాబు

  • జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబుకు పదోన్నతి
  • సాధారణ కార్యకర్తలాగానే పార్టీ కోసం పాటుపడ్డానన్న నాగబాబు
  • ఇప్పుడు తనపై మరింత బాధ్యత పెరిగిందని వెల్లడి
  • పవన్ కల్యాణ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళతామని వివరణ
  • 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యమని ఉద్ఘాటన
Nagababu press meet after he appointed as Janasena general secretary

జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా ఉన్న నాగబాబు తాజాగా పదోన్నతి పొందారు. తన నియామకం తర్వాత నాగబాబు తొలిసారిగా స్పందించారు. 2019 నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నానని, పీఏసీ మెంబర్ ని అయినప్పటికీ సాధారణ కార్యకర్తలాగానే పార్టీ కోసం కృషి చేశానని చెప్పారు. 

పదవుల కోసం ఎప్పుడూ ఆలోచించలేదని, పార్టీ కోసం తాను ఏం చేయగలనన్నదాని గురించే ఆలోచించానని నాగబాబు వివరించారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. 

తాజా నియామకం అనంతరం మరింత బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రధాన కార్యదర్శి అనేది ఒక పదవిలా భావించడంలేదని, ఇది ఒక బాధ్యత అనుకుంటున్నానని అన్నారు. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ కోసం పాటుపడతానని ఉద్ఘాటించారు. పార్టీలో చిన్న చిన్న విభేదాలను పరిష్కరించుకోవడంపై చొరవ చూపిస్తాని నాగబాబు పేర్కొన్నారు. 

పవన్ కల్యాణ్ సిద్ధాంతాలను, భావజాలాన్ని, ఆయన త్యాగనిరతిని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందని భావిస్తున్నానని వివరించారు. పవన్ కల్యాణ్ వంటి మంచి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి అని ప్రజలను చైతన్యవంతులను చేసే దిశగా కృషి చేస్తానని వెల్లడించారు. ఈ క్రమంలో మరింత ఎక్కువగా జనసైనికులు, వీరమహిళలను కలుస్తుంటానని, తనను ఎవరైనా కలవొచ్చని సూచించారు.

More Telugu News