Nara Lokesh: వివిధ రంగాల ప్రొఫెషనల్స్ తో లోకేశ్ ముఖాముఖి... ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

  • అనంతపురం జిల్లాలో లోకేశ్ పాదయాత్ర
  • శింగనమల నియోజవర్గంలో కొనసాగుతున్న యువగళం
  • జంబులదిన్నె క్యాంప్ సైట్ లో యువతతో లోకేశ్ సమావేశం
  • టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పిన టీడీపీ అగ్రనేత 
Lokesh held meeting with multi sector professionals

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ చేపడుతున్న యువగళం పాదయాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఆయన ఇవాళ శింగనమల నియోజకవర్గంలోని జంబులదిన్నె యువగళం క్యాంపుసైట్ లో వివిధ రంగాల ప్రొఫెషనల్స్ తో ముఖాముఖి నిర్వహించారు. వారితో తన ఆలోచనలు పంచుకున్నారు. వారి అభిప్రాయాలు, సూచనలు విన్నారు. తాము అధికారంలోకి వస్తే ఏంచేస్తామో స్పష్టమైన హామీలు ఇచ్చారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ...

•    ప్రొఫెషనల్స్ సత్తాను ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాటారు.
•    దుర్మార్గపు పాలన అంతమే లక్ష్యంగా మీరు తీర్పునిచ్చారు.
•    ఏపీ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కట్టుబట్టల్తో రోడ్డు మీద పడేశారు.
•    కానీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ధీటుగా ఏపీకి చంద్రబాబు పెట్టుబడులు తెచ్చారు.
•    అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించింది చంద్రబాబు గారు. రాయలసీమకు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ సంస్థలు తీసుకొచ్చాం. విశాఖకు ఐటీ కంపెనీలు తెచ్చాం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వాని ప్రోత్సహించాం.
•    కియా పరిశ్రమ వల్ల అనంతపురం జిల్లా ప్రజల తలసరి ఆదాయం రూ.30 వేలకు పెరిగింది.
•    అద్భుతమైన రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు.
•    కానీ ఇవేవీ మేం గతంలో ప్రచారం చేసుకోలేదు.
•    జగన్మోహన్ రెడ్డి అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు.
•    ఐటీ ఎగుమతుల్లో ఏపీ వెనుకంజలో ఉందని పార్లమెంటు సాక్షిగా రుజువైంది.
•    జగన్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయింది
•    ఏపీకి పూర్వవైభవాన్ని తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది.
•    గత పాలనలో రాష్ట్రాభివృద్ధిలో ప్రొఫెషనల్స్  కీలకపాత్ర పోషించారు.
•    రానున్న కాలంలో మీ సహాయ, సహకారాలు అందించండి. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు మీ వంతు కృషిని మీరు చేయాలని కోరుతున్నా.
•    అందరం కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసుకోవాలి.
•    మేం అధికారంలోకి వచ్చాక పరిశ్రమలను ప్రోత్సహిస్తాం. మీరు పనిచేసే రంగాలను మన రాష్ట్రానికి వచ్చేలా మీరు వారిపై ఒత్తిడి తెచ్చి మన రాష్ట్రానికి తీసుకురావాలి.
•    గతంలో హెచ్.సీ.ఎల్ కంపెనీని ఏపీకి తీసుకొచ్చాం. నేడు వేలాది మంది దాంట్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇటువంటివి మరిన్ని మన రాష్ట్రానికి మనం తెచ్చుకోవాలి.
•    యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి. దీనికి మీరు బాధ్యత వహించాలి.
•    అన్ని రంగాల్లో ఏపీ నంబర్ వన్ కావాలనేదే మా లక్ష్యం. దానికోసం మేం పనిచేస్తాం.
•    పక్క రాష్ట్రాల్లో పనిచేసే ఏపీ యువతను ఏపీకి తీసుకొచ్చే విధంగా పనిచేయడమే మా లక్ష్యం.
•    కేంద్రం నుండి జీఎస్టీలో వాటాను తెచ్చుకోవడంలో ఒరిస్సా రాష్ట్రం కంటే ఏపీ వెనుకబడింది.
•    ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను ప్రోత్సహించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే మా లక్ష్యం. మీరు కూడా సహాయ, సహకారాలు అందించాలని కోరుతున్నా.

ప్రశ్నోత్తరాలు...

గౌతమ్,ఐటీ ఉద్యోగి, ఉరవకొండ: గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ సేవలు సరిగా లేవు. మీరు అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరిస్తారా?
లోకేశ్: నా పాదయాత్రలో నేను కూడా సిగ్నల్స్ దొరక్క చాలా ఇబ్బందులుపడుతున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయి. చంద్రబాబు గతంలో ఏపీ ఫైబర్ నెట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించారు. మళ్లీ మేం అధికారంలోకి వచ్చాక సమస్యను పరిష్కరిస్తాం. ఫైబర్ నెట్ ద్వారా అనేక గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించాం. ఇప్పుడు ఫైబర్ నెట్ ను వైసీపీ ప్రభుత్వం చంపేసింది.

భాస్కర్: నేను స్టార్టప్ ప్రారంభించాలనుకుంటున్నాను. మీరు అధికారంలోకి వచ్చాక ఎలా ప్రోత్సహిస్తారు?
లోకేశ్: విశాఖ వేదికగా ఇన్నోవేషన్ వ్యాలీ అనే వేదిక ద్వారా మనం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాం. వారికి ఇన్సెంటీవ్ లను కూడా ఇచ్చాం. తిరుపతి, అమరావతిలో శాటిలైట్ యూనిట్లను ఏర్పాటు చేశాం. దాని ద్వారా కూడా కంపెనీలను ప్రోత్సహించాం. వైసీపీ పాలనలో దాన్ని చంపేశారు. మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రారంభిస్తాం.

మణికంఠ: అనంతపురంకు ఐటీ తీసుకువస్తాం అని గతంలో హామీ ఇచ్చారు దాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు?
లోకేశ్: అనంతపురంను ఐటీ హబ్ గా తీర్చిదిద్దాలని గతంలో అనేక పనులు చేశాం. బెంగుళూరు ప్లస్ ప్లస్ అనే కార్యక్రమం రూపొందించాం. బెంగుళూరుకి ఆనుకొని ఉన్న అనంతపురంలో భూములు సేకరించి ఐటీ హబ్ ఏర్పాటు చెయ్యాలని గతంలో ప్రణాళిక సిద్దం చేసాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనంతపురం జిల్లాకి ఐటీ పరిశ్రమలు తీసుకొస్తాం. లేపాక్షి భూములను కూడా అభివృద్ధి చేసి ఐటీ హబ్ ను నెలకొల్పుతాం.

హిమబిందు, డాక్టర్: ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీలో ఆలస్యం జరుగుతోంది. కోవిడ్ సమయంలో డాక్టర్ల సేవలను వినియోగించుకున్నారు. వారికి ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ఇవ్వకుండా ఇంటికి పంపారు. మమ్మల్ని మీరే ఆదుకోవాలి.
లోకేశ్: వైసీపీ పాలనలో వైద్యరంగం చాలా దెబ్బతింది. ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదు. ఆరోగ్యశ్రీ బిల్లులు గతంలో మేం సక్రమంగా ఇచ్చేవాళ్లం. నేడు ఇవ్వకుండా డాక్టర్లను వేధిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ఐపీ బాటలో నడుస్తోంది. కేంద్రం దగ్గరకు అప్పుల కోసం వెళ్తున్నారే తప్ప రాష్ట్రాభివృద్ధి కోసం కాదు. అన్ని రంగాల వాళ్లు ప్రభుత్వం చేతిలో బాధితులుగా మారారు. పరిశ్రమల అధినేతలు కూడా సబ్సిడీలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఆరోగ్యశ్రీని ఏ విధంగా ప్రోత్సహించామో, మళ్లీ అధికారంలోకి వచ్చాక ప్రోత్సహిస్తాం. ప్రభుత్వ-ప్రైవేటు ఆసుపత్రులను సమానంగా ప్రోత్సహిస్తాం, అభివృద్ధి చేస్తాం. 

శ్రీకాంత్, గూగుల్ ఉద్యోగి: మన రాష్ట్రంలోని కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. మళ్లీ ఆ కంపెనీలు మన రాష్ట్రానికి వస్తే ఎలా ప్రోత్సహిస్తారు?
లోకేశ్: వైసీపీ పాలనలో మన రాష్ట్రంలోని అనేక కంపెనీలు పక్కరాష్ట్రాలకు వెళ్లిపోయాయి. ఈ క్రమంలో చాలా మంది జగన్ రెడ్డి నిరంకుశ విధానాల వల్ల నష్టపోయారు. అటువంటి వారిని ఏపీకి తీసుకురావడం మా ముందు ఉన్న సవాల్. ప్రభుత్వాలు మారినా కంపెనీలకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఓ కట్టుదిట్టమైన చట్టాన్ని తెచ్చి వారికి నమ్మకం కల్పిస్తాం. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీని బీహార్ గా మార్చారు.

అరుణ్ వర్ధన్ రెడ్డి, ఇంజినీర్: ఏపీలో రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్లు లేవు. మీరు అధికారంలోకి వచ్చాక వాటిని మీరు తీసుకొస్తారా?
లోకేశ్: అనంతపురంజిల్లాకు రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్లను తెస్తాం. కియా పరిశ్రమను తెచ్చేందుకు ఇన్సెంటీవ్ లను అధికంగా ఇచ్చి తెచ్చాం. భవిష్యత్తులో ఏపీకి తప్పకుండా ఆర్ అండ్ డీ సెంటర్లు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తాం.

ప్రకాశ్, ముంబయి: నేను ముంబయిలో ఉద్యోగం చేస్తున్నాను. 18గంటలు ప్రయాణం చేసి మీ వద్దకు వచ్చాను. నాలాంటి వాళ్లు వచ్చే కాలంలో మన ప్రాంతంలోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు తెస్తారా? మాలాంటి వాళ్లకు మీరు ఇచ్చే భరోసా ఏంటి?
లోకేశ్: చంద్రబాబు అంటే భరోసాకు బ్రాండ్. జగన్మోహన్ రెడ్డి జైళ్లకు బ్రాండ్. జగన్మోహన్ రెడ్డి భూమ్ భూమ్, ప్రెసిడెంట్ మెడల్ వంటికి తప్ప ఏపీకి తెచ్చింది ఏమీ లేవు. చంద్రబాబు పాలనలో విదేశాలకు వెళ్లి పెద్దపెద్ద కంపెనీ యాజమానులను కలిసి ఏపీకి పెట్టుబడులు, కంపెనీలు తెచ్చారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అంటూ ఫేక్ సమిట్ నిర్వహించి రాష్ట్ర ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది.

రాజేశ్, కళ్యాణదుర్గం, బెంగళూరులో ఐటీ ఉద్యోగి: జగన్మోహన్ రెడ్డి కూల్చివేతలు, బెదిరింపు ధోరణి వల్ల రాష్ట్రం నుండి అనేక పరిశ్రమలు, కంపెనీలు పక్క రాష్ట్రాలకు పారిపోయాయి. వాటిని ఏపీకి ఎలా తీసుకువస్తారు? ఆ కంపెనీలకు, ప్రస్తుతం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర యువతకు ఏ విధంగా భరోసా ఇస్తారు?
లోకేశ్: నిర్ధిష్టమైన చట్టం చేసి కంపెనీలకు ఇబ్బందిలేకుండా చేస్తాం. వాళ్లకు నమ్మకం కల్పించి పెట్టుబడులు పెట్టేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర యువతకు ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. వాళ్ల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాం. జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్చివేయడంతో ప్రారంభించి నేటికీ కూల్చివేత పనుల్లోనే ఉన్నాడు. ఇలాంటి వ్యక్తికి మనం అధికారం ఇచ్చి మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకున్నాం. వైసీపీ పాలనలో నిత్యాసవరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు అన్నీ పెరిగిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.

శ్రీధర్ బాబు, ఐటీ ట్రైనర్, గుంతకల్లు: ఇతర కోర్సులు చదువుకున్న వాళ్లు సాఫ్ట్ వేర్ రంగం వైపు వెళ్లేందుకు కోచింగ్ తీసుకుంటున్నారు. దీనికి గల కారణం వేరే రంగాల్లో ఉద్యోగాలు లేవు. అందుకే ఇటు వస్తున్నామని చెబుతున్నారు. ఉద్యోగాలకు అవసరమైన కోర్సులు ఇంటర్ నుండే చేర్చాలి.
లోకేశ్: టీడీపీ అధికారంలోకి వచ్చాక కేజీ టు పీజీ సిలబస్ ను మేం మారుస్తాం. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగంలోకి వెళ్లే విధంగా సిలబస్ ను రూపొందిస్తాం. చంద్రబాబు పాలనలో ఫార్మా రంగం ఏపీలో అభివృద్ధి చెందింది. అదానీ డేటా సెంటర్ ను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెచ్చాం. కానీ జగన్ దాన్ని తరిమేశాడు. విశాఖ వేదికగా ఐటీని కిక్ స్టార్ట్ చేసి అభివృద్ధి చేస్తాం.

వెంకటేశ్, అనంతపురం, సీఏ: ఏపీలో చార్టెడ్ అకౌంటెంట్లపై అనేక వేధింపులు జరుగుతున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక మాకు ఏ విధంగా భద్రత కల్పిస్తారు?
లోకేశ్: ఏపీ ఎంత అప్పుల్లో ఉందో తెలియని పరిస్థితి ఉంది. త్వరలో బ్యాంకు అధినేతలకు మేం ఏపీ అప్పులపై లేఖలు రాసి ఎంత అప్పు ఉందో తెలుసుకుంటాం. ఆర్థిక మంత్రి బుగ్గన అప్పులపై బుర్రకథలు చెబుతున్నారు. కాగ్ కు కూడా నివేదికలను ఏపీ ప్రభుత్వం సకాలంలో ఇవ్వడం లేదు. జగన్ పాలనలో చార్టెడ్ అకౌంటెంట్లు మాత్రమే కాదు, అన్ని రంగాల వారు వేధింపులకు గురవుతున్నారు. ఇంకొక 10నెలలు ఓపిక పట్టండి. అధికారంలోకి వచ్చేది మనమే. మీ సమస్యలు తీరుస్తాం.

భాస్కర్, రిటైర్డ్ ప్రిన్సిపల్: మీరు కేజీ టు పీజీ సిలబస్ మారుస్తామని చెబుతున్నారు. ఈ సిలబస్ ను పిల్లలకు బోధించాల్సింది టీచర్లే. టీచర్లకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. టీచర్లకు సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ ను అమలు చేయాలి.
లోకేశ్: టీచర్లు సీపీఎస్ సమస్యకంటే అధికంగా యాప్ లు, ఫోటోలు తీసే పనులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత పాలనలో ఏ రాష్ట్రమూ ఇవ్వనంత ఫిట్ మెంట్ ను చంద్రబాబు ఉద్యోగులకు, టీచర్లకు ఇచ్చారు. ఓపీఎస్ విధానం కేంద్రం చేతుల్లో ఉంది. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. మోసపోయారు. టీచర్లతో రానున్న కాలంలో ఓపీఎస్ పై ఓ చర్చ నిర్వహించి సరైన నిర్ణయం తీసుకుంటాం. అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయులపై నేడు ఉన్న పని ఒత్తిడిని తగ్గిస్తాం. యాప్ విధానాన్ని రద్దు చేస్తాం.

More Telugu News