Harsha Kumar: దత్తపుత్రుడు జగన్ ను మోదీ కోర్టుకు వెళ్లకుండా చేశారు: మాజీ ఎంపీ హర్షకుమార్

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ కు షాక్ తగిలిందన్న హర్ష కుమార్
  • అన్ని స్థానాల్లో టీడీపీ పోటీ చేసినా గెలిచేదని వ్యాఖ్య
  • మందుబాబులంతా జగన్ ను తిట్టుకుంటున్నారన్న మాజీ ఎంపీ
Jagan is responsible for defeat of YSRCP says Harsha Kumar

ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ దత్తపుత్రుడని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. దత్తపుత్రుడుగా ఉన్న జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు వెళ్లకుండా మోదీ చేశారని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ కు షాక్ తగిలిందని... జగన్ పొగరే ఆయనను పతనం చేస్తోందని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలలో చాలా మంది జగన్ పై అసంతృప్తితో ఉన్నారని అన్నారు. 

అసలు ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో పోటీ చేసినా గెలిచేదని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి జగనే కారణమని అన్నారు. రాష్ట్రంలో మద్యం తాగేవాళ్లంతా జగన్ ను తిట్టుకుంటున్నారని చెప్పారు. దళతులను హత్య చేసిన వాళ్లను అరెస్ట్ కూడా చేయడం లేదని విమర్శించారు. 

ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న వారందరిపై కేసులు పెడుతున్నారని... బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన వారందరినీ విదేశాలకు మోదీ పంపించేశారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై వేటు వేయడం అత్యంత దారుణమని అన్నారు. అదానీ, అంబానీలకు దేశాన్ని దోచిపెట్టినా ఎవరూ మాట్లాడకూడదనే సందేశాన్ని దేశ ప్రజలకు మోదీ ఇచ్చారని మండిపడ్డారు.

More Telugu News