Revanth Reddy: పేపర్ లీకేజీ కేసు.. రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు!

  • పేపర్ లీక్ పై ఆరోపణలు చేసిన రేవంత్ కు నోటీసులిచ్చిన సిట్
  • ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని సూచన
  • మరికొందరు నేతలకు నోటీసులిచ్చే యోచనలో అధికారులు
  • నోటీసులు ఇంకా అందలేదని, అందాక స్పందిస్తానని రేవంత్ వెల్లడి
Sit gives notices to Revanth Reddy related to paper leakage case

టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు కీలక మలుపు తీసుకుంది. పేపర్ లీక్ విషయంలో ఆరోపణలు చేసిన రాజకీయ నేతలకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేస్తోంది. సోమవారం ఈ మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది.

పేపర్ లీక్ విషయంలో చేసిన ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని రేవంత్ రెడ్డిని నోటీసుల్లో సిట్ కోరింది. మరికొందరికి కూడా నోటీసులు ఇచ్చే ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కూడా నోటీసులు ఇచ్చే అవకాశముందని సమాచారం. ఆధారాలు తమకు అందిస్తే దానిపై విచారణ జరుపుతామని సిట్ అధికారులు అంటున్నారు. 

సిటీ నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందించారు. నోటీసులు ఇంకా తనకు అందలేదని తెలిపారు. నోటీసుల్లో ఏముందో తనకు తెలియదని, వాటిలో ఏముందో తెలిశాక స్పందిస్తానని చెప్పారు. కాగా.. ఒకే మండలంలో చాలా మందికి వందకు పైగా మార్కులు వచ్చాయని రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోపించారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని చెప్పారు.

More Telugu News