లండన్ లోని భారత హైకమిషన్ భవనంపై భారీ త్రివర్ణ పతాకం.. వీడియో ఇదిగో!
- జెండాను తీసేసిన మరుసటి రోజే భారీ పతాకం ఏర్పాటు
- ఖలిస్థానీ మద్దతుదారులకు చెంపపెట్టులా హైకమిషన్ నిర్ణయం
- కమిషన్ భవనం పై నుంచి కిందిదాకా మువ్వన్నెల జెండా రెపరెపలు
భారత్ లో ఖలిస్థానీ మద్దతుదారుడు, పంజాబ్ వారిస్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను అరెస్టు చేసేందుకు పంజాబ్ పోలీసులు ప్రయత్నించారు. ఆయన సొంతూరు జల్లూపూర్ ఖేరా వస్తున్నాడని తెలిసి పట్టుకోవడానికి ప్రయత్నించారు. అమృత్ పాల్ ప్రయాణిస్తున్న కారును తమ వాహనాలతో పోలీసులు వెంబడించారు. దాదాపు 25 కిలోమీటర్ల పాటు చేజింగ్ చేశారు. చిక్కినట్లే చిక్కి చివరి క్షణంలో అమృత్ పాల్ తప్పించుకున్నాడు. దీంతో పంజాబ్ వ్యాప్తంగా అమృత్ పాల్ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.
పంజాబ్ లో అమృత్ పాల్ కోసం పోలీసులు జరుపుతున్న వేటపై లండన్ లో ఖలిస్థానీ మద్దతుదారులు ఆందోళన చేశారు. భారత హైకమిషనర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా కమిషన్ భవనంపైనున్న త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరిచారు. జెండాను కిందికి దించారు. ఇదంతా జరుగుతుంటే అడ్డుకోవడానికి అక్కడ సెక్యూరిటీ సిబ్బంది లేరు. ఈ ఘటనపై భారత హైకమిషన్ వేగంగా స్పందించింది. మరుసటి రోజే భారీ త్రివర్ణ పతాకాన్ని హైకమిషన్ బిల్డింగ్ పై ఏర్పాటు చేసింది.