Rain: రేపటి విశాఖ వన్డేకి వాన గండం

  • తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
  • ఏపీకి మరో రెండ్రోజుల పాటు వర్షసూచన
  • మార్చి 19న విశాఖలో టీమిండియా, ఆసీస్ మధ్య రెండో వన్డే
  • మ్యాచ్ రోజున వర్షం కురిసే అవకాశాలు
Rain threat for Vizag ODI

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ రేపు (మార్చి 19) విశాఖపట్నంలో జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ కు వాన ముప్పు ఉన్నట్టు వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు విశాఖలో డే/నైట్ మ్యాచ్ జరగనుండగా, టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. 

ఏపీ కోస్తా జిల్లాల్లో వర్షాలు పడుతుండగా, రేపు విశాఖలోనూ వరుణుడి ప్రభావం కనిపించే అవకాశాలున్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దాంతో ఈ మ్యాచ్ జరగడంపై సందిగ్ధత నెలకొంది. 

నిన్న ముంబయిలో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ పై టీమిండియా 5 వికెట్ల తేడాతో నెగ్గడం తెలిసిందే. దాంతో, మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది.

More Telugu News