manchu majoj: కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడంటారు.. అది ఇదేనేమో: మంచు మనోజ్

  • తాను, మౌనిక నాలుగేళ్లుగా ఎన్నో కష్టాలు పడ్డామన్న మనోజ్ 
  • చివరకు తమ ప్రేమ గెలిచిందని హర్షం 
  • శివుడి ఆజ్ఞతోనే కొడుకు కూడా వచ్చాడని వ్యాఖ్య 
Me and Mounika faced many issues since 4 years says Manchu Manoj

సినీ నటుడు మంచు మనోజ్, దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనిక రెడ్డి వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ కొత్త జంట నేడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. మరోవైపు వీరిద్దరికీ ఇది రెండో వివాహం అనే విషయం కూడా విదితమే. మౌనికకు తొలి భర్త ద్వారా ఒక కొడుకు కూడా ఉన్నాడు. 

శ్రీవారి దర్శనానంతరం మీడియాతో మంచు మనోజ్ మాట్లాడుతూ, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తాడంటారని... అది ఇదేనేమో అని అన్నారు. పెళ్లి అయిన తర్వాత మౌనిక వాళ్ల ఊరికి వెళ్లి, అక్కడి నుంచి తిరుమలకు వచ్చామని చెప్పారు. తనకు చాలా సంతోషంగా ఉందని... జీవితంలో ఏది ఓడిపోయినా ప్రేమ ఓడిపోకూడదని, తమ ప్రేమ గెలిచిందని అన్నారు. తన తల్లిదండ్రుల ఆశీస్సులు, తన అక్క సపోర్ట్, ఆశీస్సులు, పై నుంచి మౌనిక తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్నంత వరకు తమకు ఏమీ కాదని చెప్పారు. 

12 ఏళ్లుగా మౌనికతో తనకు పరిచయం ఉందని... నాలుగేళ్లుగా ఇద్దరం చాలా బాధలు పడ్డామని, ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కొన్నామని, అయినా తాము గట్టిగా నిలబడి నాలుగేళ్లుగా అందరి దీవెనల కోసం ఎదురు చూశామని, శివుడి ఆశీస్సులతో ఇద్దరం ఒకటయ్యామని అన్నారు. శివుడి ఆజ్ఞతోనే నడిచొచ్చే కొడుకు కూడా వచ్చాడని చెప్పారు. 

త్వరలోనే తన సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని మనోజ్ తెలిపారు. ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే మొదలు పెడుతున్నానని చెప్పారు. తనకు ప్రజలకు సేవ చేయాలని ఉందని... కానీ, రాజకీయాల్లోకి రావాలని లేదని తెలిపారు. మౌనిక రాజకీయాల్లోకి రావాలనుకుంటే తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. మనోజ్ దంపతులతో పాటు మంచు లక్ష్మి దంపతులు కూడా స్వామి వారిని దర్శించుకున్నారు.

More Telugu News