Anikha Surendran: పాపం .. ముగ్గురు ముద్దుగుమ్మలకూ కలిసిరాలేదే!

  • 'బుట్టబొమ్మ'తో పరిచయమైన అనిఖ సురేంద్రన్ 
  • 'అమిగోస్'తో అలరించిన ఆషిక రంగనాథ్ 
  • 'శ్రీదేవి శోభన్ బాబు'తో ఎంట్రీ ఇచ్చిన గౌరీ కిషన్ 
  • నిరాశపరిచిన ఫలితాలతో ఆలోచనలో బ్యూటీస్  
Tollywood Industry introduced Three New Heroines

తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతూ వస్తున్నారు. అలా ఈ నెలలో ముగ్గురు ముద్దుగుమ్మలు ఇక్కడి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ నెల 4వ తేదీన విడుదలైన 'బుట్టబొమ్మ' సినిమాతో, అనిఖ సురేంద్రన్ తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైంది. నటన విషయంలో అనిఖకి వంక బెట్టవలసిన అవసరం లేదు. కానీ కథాకథనాల పరంగా ఈ సినిమా పరాజయం పాలైంది. ఈ నెల 10వ తేదీన వచ్చిన 'అమిగోస్'తో ఆషిక రంగనాథ్ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. కల్యాణ్ రామ్ జోడీగా ఈ బ్యూటీ అలరించింది .. ఆకట్టుకుంది. అయితే ఆశించిన స్థాయిని ఈ సినిమా అందుకోలేకపోయింది. ఇక ఈ నెల 18న థియేటర్లకు వచ్చిన 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమాతో, గౌరీ కిషన్ కథానాయికగా పరిచయమైంది. బొద్దుగా .. అక్కడక్కడా చార్మీ పోలికలతో కనిపించింది. ఈ సినిమా టైటిల్ ను బట్టి అక్కడ కంటెంట్ ఏదో ఉంటుందని వెళ్లిన ప్రేక్షకులకు, అందుకు పూర్తి భిన్నమైన కంటెంట్ పలకరించింది. ఈ సినిమా ఏ రకంగాను ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముగ్గురు భామలకు కూడా ఫస్టు సినిమా కలిసిరాలేదు. అయితే కథాకథనాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, గ్లామర్ పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసిన ఆషిక రంగనాథ్ తెలుగు తెరపై కుదురుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News