Jogi Naidu: నటుడు జోగినాయుడికి ఏపీ ప్రభుత్వ పదవి

  • జోగి బ్రదర్స్ కార్యక్రమంతో గుర్తింపు తెచ్చుకున్న జోగినాయుడు
  • ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా నియామకం
  • ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు
AP Govt post for actor Jogi Naidu

తెలుగు బుల్లితెరపై జోగి బ్రదర్స్ కార్యక్రమంతో పేరు తెచ్చుకున్న నటుడు జోగినాయుడికి ఏపీ ప్రభుత్వ పదవి లభించింది. జోగినాయుడిని ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. జోగినాయుడికి 'పి' కేటగిరీలో వేతన చెల్లింపులు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సినీ ప్రముఖులకు వైసీపీ సర్కారు పలు పదవులు అప్పగిస్తుండడం తెలిసిందే. కమెడియన్ అలీ ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా, మరో నటుడు పోసాని కృష్ణమురళి ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులవడం తెలిసిందే. 

జోగినాయుడు-కృష్ణంరాజు (టీవీ నటుడు) జోడీ అప్పట్లో ఉత్తరాంధ్ర యాసతో నిర్వహించిన 'జోగి బ్రదర్స్' కార్యక్రమం జెమినీ టీవీలో ప్రసారమయ్యేది. ఈ కార్యక్రమంతో జోగినాయుడు ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. 

వాస్తవానికి ఆయన సినీ దర్శకుడు అవ్వాలని హైదరాబాద్ వచ్చారు. కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్ వంటి ప్రముఖ దర్శకుల వద్ద పనిచేశారు. కొన్ని సినిమాల్లోనూ నటించారు.
.

More Telugu News