naresh: మళ్లీ పోలీసులను ఆశ్రయించిన సినీ నటుడు నరేశ్

  • పలు యూట్యూబ్ ఛానెళ్లపై గతంలోనే ఫిర్యాదు
  • విచారణ వివరాల కోసం స్టేషన్ కు వెళ్లిన సినీ నటుడు
  • తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే లీగల్ గా చర్యలు తప్పవంటూ హెచ్చరిక
Actor Naresh Again Approached Police over Trolling against him

సినీ నటుడు నరేశ్ మరోమారు పోలీసులను ఆశ్రయించారు. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న వారిపై గతంలోనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు యూట్యూబ్ ఛానెళ్లపై ఫిర్యాదు చేయడంతో పాటు అవసరమైన ఆధారాలను పోలీసులకు అందజేశారు. ఈ కేసులో విచారణ ఎంతవరకు వచ్చిందనేది తెలుసుకోవడానికి స్టేషన్ కు వెళ్లారు. 

సినీ నటి పవిత్ర లోకేశ్ తో తన బంధం గురించి నరేశ్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే! అంతకుముందు నుంచే పలు సందర్భాలలో ఇద్దరూ కలిసి కనిపించడంతో రకరకాల ప్రచారం జరిగింది. యూట్యూబ్ ఛానెళ్లు వీళ్ల బంధంపై పుకార్లను ప్రసారం చేశాయి. కొన్నాళ్లపాటు ఈ జంట సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై నరేశ్ సీరియస్ గా స్పందించారు. తన పరువుకు భంగం కలిగించేలా కథనాలు ప్రసారం చేస్తున్న యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు తన బెడ్రూమ్ లోకి తొంగిచూసినట్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించారు. వాటి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పలు ఆధారాలనూ ఆయన పోలీసులకు అందజేశారు. తాజాగా, ఈ కేసు విచారణ గురించి తెలుసుకోవడానికి నరేశ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్లు సమాచారం.

More Telugu News