Aruna Miller: అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ.. మేరీలాండ్ గవర్నర్‌గా అరుణా మిల్లర్

Aruna Miller Sworn in as Maryland s First Indian American Lieutenant Governor
  • ఏడేళ్ల వయసులో ఏపీ నుంచి అమెరికాకు వెళ్లిన అరుణ
  • మిస్సోరి యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా
  • తనను ఉన్నత స్థానానికి తీసుకెళ్లారంటూ మేరీలాండ్ ప్రజలకు కృతజ్ఞతలు
అమెరికాలో మరో తెలుగు మహిళ చరిత్ర సృష్టించారు. మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పోటీ చేసి విజయం సాధించిన అరుణా మిల్లర్ (58) బాధ్యతలు చేపట్టారు. అరుణా మిల్లర్ తల్లిదండ్రులది ఆంధ్రప్రదేశ్. అరుణకు ఏడాది వయసు ఉన్నప్పుడు ఆమెను అమ్మమ్మ వద్ద వదిలిపెట్టి తల్లిదండ్రులు అమెరికా వెళ్లారు. ఆ తర్వాత 1972లో వచ్చి ఆమెను తీసుకెళ్లారు. మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్‌లో అరుణ పట్టా అందుకున్నారు. 

ఇప్పుడు మేరీలాండ్ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించి ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ అమెరికన్‌గా రికార్డులకెక్కారు. ప్రారంభ ఉపన్యాసంలో అరుణ మాట్లాడుతూ.. తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఇండియాలో జరిగిన తన బాల్యమంతా తల్లిదండ్రులు దగ్గర లేరన్న బెంగతోనే గడిచిందన్నారు. తన తండ్రి, తోబుట్టువులు, అమ్మమ్మ కూడా పరాయి వారే అయిపోయారని అన్నారు. కాబట్టే ఇండియాలో గడిచిన అప్పటి విషయాలు తనకు గుర్తు లేవన్నారు. పురుషాధిపత్యం ఉన్న సమాజంలో మహిళా ఇంజినీరుగా, తనలాంటి వారు ఎవరూ లేని సభలో ఇండియన్-అమెరికన్ శాసనకర్తగా పనిచేశానని అన్నారు. తనను ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన మేరీలాండ్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్టు తెలిపారు. 

కాగా, మేరీలాండ్ గవర్నర్‌గా అమెరికన్-ఆఫ్రికన్ వెస్‌మూర్ ఎన్నికయ్యారు. మరోవైపు, మిసోరీ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా వివేక్ మాలెక్ (45) ప్రమాణ స్వీకారం చేశారు. ఆ పదవి చేపట్టిన తొలి ఇండియన్-అమెరికన్‌గా ఆయన రికార్డులకెక్కారు.
Aruna Miller
Maryland
Lieutenant Governor
Andhra Pradesh

More Telugu News