Jayasudha: మూడో పెళ్లి చేసుకుందనే వార్తలపై జయసుధ స్పందన

  • కొన్ని రోజులుగా జయసుధతో కనపడుతున్న అమెరికా వ్యక్తి
  • తన బయోపిక్ తీసేందుకు వచ్చాడన్న జయసుధ
  • తన ప్రాముఖ్యతను తెలుసుకునేందుకు తనతో పాటు ఈవెంట్లకు వస్తున్నాడని వెల్లడి
Jayasudha response on news of third marriage

ప్రముఖ సినీ నటి జయసుధ రహస్యంగా మూడో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గత రెండు రోజులుగా వైరల్ అవుతున్నాయి. జయసుధ వెళ్తున్న ప్రతి ఈవెంట్ లో ఒక వ్యక్తి కనపడుతుండమే ఈ వార్తలకు కారణం. విజయ్ సినిమా 'వారసుడు' ప్రీరిలీజ్ ఈవెంట్ కు కూడా ఆ వ్యక్తితో కలిసే ఆమె హాజరయ్యారు. దీంతో మూడో పెళ్లి చేసుకున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. జయసుధ కొన్ని రోజుల క్రితం అమెరికాకు వెళ్లారు. ఆ సందర్భంగా అక్కడి బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. 


ఈ వార్తలపై జయసుధ స్పందించారు. కొన్ని రోజులుగా తనతో తిరుగుతున్న వ్యక్తి పేరు ఫిలిప్ రుయేల్స్ అని చెప్పారు. అమెరికాకు చెందిన ఆయన తన బయోపిక్ తీసేందుకు ఇండియాకు వచ్చారని... ఇండస్ట్రీలో తన ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకునేందుకు తనతో పాటు ప్రతి ఈవెంట్ కు వస్తున్నారని తెలిపారు. ఇప్పటికే తన గురించి ఇంటర్నెట్ ద్వారా ఆయన తెలుసుకున్నారని... తన సినిమాలు, షూటింగ్స్ గురించి తెలుసుకునేందుకు తనను ఫాలో అవుతున్నారని చెప్పారు. ఇంతకు మించి తమ మధ్య మరేమీ లేదని తెలిపారు. 

జయసుధకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తను తొలి వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ జితేంద్ర కజిన్ నితిన్ కపూర్ ను ఆమె పెళ్లాడారు. 2017లో ఆయన అనారోగ్య సమస్యలతో చనిపోయారు. నితిన్ తో ఆమెకు ఒక కుమారుడు ఉన్నారు.

More Telugu News