Tollywood: వైష్ణవ్ తేజ్–శ్రీలీల చిత్రం విడుదల తేదీ ఖరారు

  • సితార, ఫార్చూన్ ఫోర్ సంస్థలు నిర్మిస్తున్న కొత్త సినిమా
  • దర్శకుడిగా పరిచయం అవనున్న శ్రీకాంత్ రెడ్డి 
  • ఏప్రిల్ 29న విడుదల కాబోతున్న చిత్రం
PVT04 in theatres from this 29 April 2023

మెగా కుటుంబ వారసుడిగా ‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్ లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు పంజా వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన’ అద్భుత విజయం సాధించడంతో అతని కెరీర్ కు ఢోకా లేదనిపించింది. అయితే, జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఎన్నో అంచనాలతో విడుదలైన అతని తదుపరి చిత్రం ‘కొండపొలం’ బోల్తా కొట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘రంగరంగ వైభవంగా’ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో, తన తదుపరి చిత్రంపై వైష్ణవ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం వైష్ణవ్‌ తేజ్ హీరోగా సితార ఎంటర్‌‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 

ఈ చిత్రంలో వైష్ణవ్ కు జంటగా యువ నటి శ్రీలీల నటిస్తోంది. షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇంకా టైటిల్ ఫైనల్ కాని ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్ 29న సినిమాని విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ‘ఉప్పెన’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవ్, ఈ మధ్య వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్ బాటలో ఉన్న శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర బృందం ఆశిస్తోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తామని తెలిపింది. వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ గెటప్‌లో కనిపించనున్నాడు.

More Telugu News