Jagan: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్

  • ధర్మారెడ్డి కుమారుడు కన్నుమూత
  • పెళ్లికార్డులు ఇచ్చేందుకు వెళ్లిన చంద్రమౌళి
  • గుండెపోటుతో మృతి
  • నంద్యాల జిల్లా పారుమంచాల గ్రామంలో అంత్యక్రియలు
CM Jagan visits TTD EO Dharmareddy home

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (28) పెళ్లి కార్డులు పంచేందుకు వెళ్లి గుండెపోటుకు గురై కన్నుమూసిన సంగతి తెలిసిందే. ధర్మారెడ్డి కుమారుడి అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించారు. 

ఈ నేపథ్యంలో, సీఎం జగన్ తీవ్ర విషాదంలో ఉన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. సీఎం జగన్ నేడు నంద్యాల జిల్లా పారుమంచాల వెళ్లారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ధర్మారెడ్డితోనూ, ఆయన కుటుంబసభ్యులతోనూ మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలంటూ పేర్కొన్నారు. 

కాగా, తన కుమారుడి చిత్ర పటానికి సీఎం జగన్ నివాళులు అర్పించే సమయంలో ధర్మారెడ్డి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. భోరున విలపించారు. 

పారుమంచాల గ్రామంలో సీఎం జగన్ ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళుతున్న సమయంలో జయమ్మ అనే మహిళ ఆయనను కలిసింది. తన కుమారుడు యోగి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, డయాలసిస్ చేయించుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఆమె సీఎంకు వివరించింది. తన కుమారుడికి అవసరమైన వైద్యసాయం, పింఛను అందించేలా చర్యలు తీసుకోవాలని ఆమె వేడుకుంది. వెంటనే స్పందించిన సీఎం జగన్ ఆ మహిళ కుమారుడి పరిస్థితిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ షామూన్ ను ఆదేశించారు.

More Telugu News