India: చైనా, జపాన్ లో కొవిడ్ మళ్లీ విజృంభణ... రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

  • ప్రపంచదేశాల్లో మరోసారి కొవిడ్ తీవ్రత
  • వారానికి 35 లక్షల కొత్త కేసుల నమోదు
  • ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం
  • కొత్త వేరియంట్లను గుర్తించాలని రాష్ట్రాలకు సూచన
  • శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని నిర్దేశం
Center alerts states as covid raises in China and other countries

చైనా, జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్ దేశాల్లో కరోనా వైరస్ ఉన్నట్టుండి విజృంభిస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇవి కొవిడ్ ఫోర్త్ వేవ్ కు సంకేతాలు కావొచ్చని, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, భారత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా పరీక్షల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులు ఏ వేరియంట్ అన్నది తెలుసుకోవాలని నిర్దేశించింది. 

ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షల కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో ఈ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదన్న విషయం అర్థమవుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ వల్ల కొత్త వేరియంట్ల ఉనికిని ప్రారంభంలోనే గుర్తించవచ్చని, తద్వారా అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు. 

ప్రపంచదేశాల్లో మరోసారి కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రేపు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

More Telugu News