YS Sharmila: అదే మాట నేను అంటే నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావ్?: మంత్రి సత్యవతి రాథోడ్ పై షర్మిల ఫైర్

YS Sharmila fires on Satyavathi Rathod
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. శిఖండి అని తనను ఆమె అన్నారని... అదే మాట తాను అంటే... నిన్ను శూర్పణఖ అంటే మొహం ఎక్కడ పెట్టుకుంటావ్? అని ప్రశ్నించారు. తన సంస్కారం అది కాదు కాబట్టి తాను అననని... ఆమె విచక్షణకే వదిలేస్తున్నానని చెప్పారు. 

ఇన్ని మాటలు మాట్లాడుతున్న సత్యవతి రాథోడ్ ఏనాడైనా పోడు భూముల కోసం కొట్లాడుతున్న ఆదివాసీల కోసం నోరు విప్పిందా? అని మండిపడ్డారు. బిడ్డల తల్లులను జుట్లు పట్టుకుని కొట్టి, జైల్లో పెడితే వారి తరపునైనా మాట్లాడిందా? అని ప్రశ్నించారు. మరియమ్మ అనే ఒక ఎస్సీ మహిళ జైల్లోనే చనిపోయినా స్పందించలేదని దుయ్యబట్టారు. 

మహిళల కోసం ఏనాడూ మాట్లాడని సత్యవతి... తనను శిఖండి అంటుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి ఉంటే సరిపోదని... ఇంగితం ఉండాలని అన్నారు. పదవికి తగ్గట్టుగా హుందాతనం కూడా ఉండాలని చెప్పారు. లోటస్ పాండ్ వద్ద నిరాహార దీక్ష సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై షర్మిల నిప్పులు చెరిగారు. 'మీరు, మీ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకోవచ్చు కానీ... ప్రజల పక్షాన కొట్లాడే వైఎస్సార్టీపీ పార్టీని మాత్రం ప్రశాంతంగా నిరాహార దీక్షలు కూడా చేసుకోనివ్వడు కేసీఆర్. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి ప్రశ్నించే గొంతుకకు సంకెళ్లు వేస్తున్నాడు. హైకోర్టు నుంచి పాదయాత్రకు అనుమతి ఉన్నా... కేసీఆర్ నియంత పాలనలో న్యాయస్థానానికి గౌరవం లేదు, ప్రజాస్వామ్యానికి విలువ లేదు. వైఎస్సార్టీపీ పార్టీ శ్రేణులను విడుదల చేసేంత వరకు, పార్టీ శ్రేణులను ఆపే ఈ కర్ఫ్యూని ఎత్తేసేంత వరకు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టదు వైఎస్ షర్మిల' అని అన్నారు.
Go Back to Shorts
YS Sharmila
YSRTP
KCR
Satyavathi Rathod
TRS
BRS

More Telugu News