pm kisan yojana: పీఎం కిసాన్ యోజన పథకంలో అనర్హుల ఏరివేతకు కొత్త రూల్స్

  • అనర్హుల ఏరివేతకు పథకంలో 8 మార్పులు
  • డబ్బుల రికవరీకి కేంద్ర ప్రభుత్వ చర్యలు
  • స్వచ్ఛందంగా తిరిగిస్తే చర్యలు ఉండవన్న అధికారులు
  • లేదంటే సొమ్ముల రికవరీతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
new rules for pm kisan yojana scheme

అన్నదాతలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ యోజన స్కీమ్.. ఈ పథకం కింద రైతులకు ఏటా రూ.6 వేలు అందజేస్తోంది. మూడు విడతల్లో ఈ మొత్తాన్ని సంబంధిత రైతుల ఖాతాల్లో వేస్తోంది. ఇప్పటి వరకు 11వ విడత సొమ్ము రైతుల ఖాతాలో చేరింది. ఇప్పుడు 12వ విడత సొమ్ము ఈ నెలలో అకౌంట్లో జమయ్యే అవకాశం ఉందని చెప్పారు. అయితే, ఈ పథకంలో అనర్హులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనర్హుల ఖాతాల్లోకి చేరిన సొమ్మును తిరిగి రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పథకంలో ఇప్పటి వరకు 8 మార్పులను చేసింది.

రైతులకు మాత్రమే దక్కాల్సిన ప్రయోజనాలను అక్రమ మార్గాల ద్వారా పొందుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. పీఎం కిసాన్ యోజన పథకం లబ్దిదారులు అందరూ తమ డాక్యుమెంట్లను అప్ డేట్ చేయాలని కోరింది. నకిలీలకు చోటివ్వకుండా మార్పులు చేసిన తర్వాత లబ్దిదారుల తాజా వివరాలను, సంబంధిత పత్రాలను అప్ లోడ్ చేయాలని సూచించింది.

అప్ డేట్ విషయంలో అనర్హులకు అవకాశం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా డబ్బులు పొంది, ఇప్పుడు వివరాలు అప్ డేట్ చేయని వాళ్లందరినీ మోసగాళ్ల జాబితాలో చేర్చనుంది. ఈ నకిలీ రైతుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. కిసాన్ యోజన ద్వారా ఇప్పటి వరకు అందుకున్న సొమ్మును ప్రభుత్వం తిరిగి వసూలు చేయడంతో పాటు చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని అధికారవర్గాల సమాచారం. నకిలీ పత్రాలతో ఈ పథకంలో చేరితే పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డబ్బులను రిటన్‌ చేయవచ్చు. స్వచ్చంధంగా సొమ్మును తిరిగిచ్చే వాళ్లపై ఎలాంటి
చర్యలు ఉండవని అధికారులు చెప్పారు.

More Telugu News