Amit Shah: అమిత్ షాతో ధోనీ కరచాలనం... బీజేపీలోకి మాజీ కెప్టెన్ అంటూ ప్రచారం

  • చెన్నైలో ఇండియా సిమెంట్స్ వజ్రోత్సవ వేడుకలు
  • కార్యక్రమానికి హాజరైన అమిత్ షా, ఎంఎస్ ధోనీ
  • అమిత్ షాతో ధోనీ భేటీలో రాజకీయ ప్రాధాన్యం లేదని కొందరి వాదన
  • ఈ వార్తలపై స్పందించని ధోనీ, బీజేపీ
ms dhoni shakes hands with amit shah in chennai

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్యకి బీజేపీ టికెట్ దక్కిన తరుణంలో... శనివారం సోషల్ మీడియాలో కనిపించిన ఓ ఫొటో తెగ వైరల్ గా మారిపోయింది. ఈ ఫొటోలో టీమిండియా మాజీ సారథి, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ... కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కరచాలనం చేస్తున్నారు. శనివారం తమిళనాడు పర్యటనకు వెళ్లిన అమిత్ షా... ఇండియా సిమెంట్స్ వజ్రోత్సవ వేడుకల్లో పాలుపంచుకున్నారు.

ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ గతంలో బీసీసీఐ చైర్మన్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యజమాని కూడా ఆయనేనన్న విషయం తెలిసిందే. సీఎస్కేకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోనీ... ఇండియా సిమెంట్స్ వజ్రోత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అమిత్ షాతో ధోనీ కరచాలనం చేశారు. 

ఈ ఫొటో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చినంతనే అది వైరల్ గా మారిపోయింది. అమిత్ షాతో కలిసిన ధోనీ... త్వరలోనే బీజేపీలో చేరనున్నారంటూ ఓ వార్త పుట్టింది. అయితే సీఎస్కే జట్టు యాజమాన్యం కంపెనీ నిర్వహించిన కార్యక్రమానికి ఆ జట్టు కెప్టెన్ హోదాలోనే ధోనీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారని, అదే కార్యక్రమానికి వచ్చిన అమిత్ షాను ఆయన మర్యాదపూర్వకంగానే కలిశారని, ఇందులో రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదని కొందరు చెబుతున్నారు. అయితే ఈ వార్తలపై అటు ధోనీ గానీ, ఇటు బీజేపీ గానీ స్పందించలేదు.

More Telugu News