ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట

IAS srilaxmi got clean chit in obulapuram mining company scam
  • ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో క్లీన్ చిట్
  • శ్రీలక్ష్మిపై అభియోగాలను కొట్టేసిన కోర్టు
  • ఏపీ సీఎస్ గా నియామకం కావడానికి శ్రీలక్ష్మికి తొలగిన అడ్డంకులు
ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) నుంచి ముడుపులు స్వీకరించారన్న కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఆమెపై మోపిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. శ్రీలక్ష్మిని నిర్దోషిగా పరిగణిస్తూ, ఈ కేసులో ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ మంగళవారం హైకోర్టు తీర్పు చెప్పింది. ఓఎంసీ ముడుపుల వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేయడంతో శ్రీలక్ష్మి ఏడాదిపాటు జైలులో గడపాల్సి వచ్చింది.

సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి 2004-09 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో మైనింగ్ లీజులు పొందేందుకు శ్రీలక్ష్మి సహకరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు గాను ఆమె భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారని ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు శ్రీలక్ష్మిని అరెస్టు చేసి జైలుకు పంపారు.

తాజాగా ఈ కేసును హైకోర్టు విచారించింది. శ్రీలక్ష్మిపై అభియోగాలకు సరైన ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ కు చీఫ్ సెక్రెటరీగా శ్రీలక్ష్మి నియామకానికి అడ్డంకులు తొలిగినట్టయింది. అయితే, ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని సీబీఐ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి కేసులో సుప్రీంకోర్టులో సీబీఐ పోరాడుతోంది.
Go Back to Shorts
Srilaxmi
omc
mining
ap cs
Andhra Pradesh

More Telugu News