Arjun: అర్జున్ - విష్వక్ గొడవపై తమ్మారెడ్డి ఏమన్నారంటే.. !

  •  విష్వక్సేన్ ధోరణి పట్ల అసహనాన్ని వ్యక్తం చేసిన అర్జున్ 
  • ఆయన తీరు పట్ల తనదైన శైలిలో సమాధానమిచ్చిన విష్వక్ 
  • కొత్తగా వచ్చిన హీరోలు తీరు మార్చుకోవాలన్న తమ్మారెడ్డి 
Tammareddy Bharadvaja Interview

యాక్షన్ కింగ్ అర్జున్ తన కూతురు ఐశ్వర్యను టాలీవుడ్ కి పరిచయం చేయడం కోసం తానే దర్శక నిర్మాతగా మారారు. ఈ సినిమాలో హీరోగా విష్వక్సేన్ ను తీసుకున్నారు. అయితే అతని ధోరణి కారణంగా ఇబ్బందులు పడ్డామనీ, ఇకపై ప్రాజెక్టును కొనసాగించే ఆలోచన లేదని అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. తన అభిప్రాయాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వని కారణంగా, ఆ ప్రాజెక్టు విషయంలో తాను అసంతృప్తిగానే ఉన్నానని విష్వక్ చెప్పాడు. 

తాజాగా ఈ విషయాన్ని గురించి తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. "ఎన్టీ రామారావుగారు ఎవరి దర్శకత్వంలో చేసినా, ఆయన దర్శకుడు చెప్పినట్టుగా చేసేవారు. దర్శకుడికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకునేవారు కాదు. ఇదే నిబద్ధతను నేను బాలకృష్ణగారిలోను చూశాను. ఇచ్చిన కాల్షీట్ ప్రకారం బాలకృష్ణ సెట్లో ఉండేవారు. కానీ ఈ గొడవలో అర్జున్ గారు షూటింగు మొదలుపెట్టేశారు, విష్వక్ సేన్ కొంతవరకూ చేశారు. 'నాకు నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడుకున్నాక మొదలెడదాం' అని అన్నట్టుగా విష్వక్ చెబుతున్నాడు. 

అర్జున్ కి దర్శకుడిగా కూడా మంచి అనుభవం ఉంది .. చాలా సూపర్  హిట్లు ఇచ్చారు.  ఆయన అవుట్ డేటెడ్ అనుకుంటే విష్వక్  ముందుగానే మానుకోవలసింది. సినిమా ఒప్పుకున్నాక మాటలు బాగోలేదు .. పాటలు బాగోలేదు అంటే ఎలా? నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు ప్రతి విషయంలోను జోక్యం చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కూడా. కొత్త నిర్మాతలు .. కొత్త దర్శకులు .. వివిధ రకాల కథలతో వస్తున్నారు. కానీ హీరోలు చెప్పినట్టు చేయడం వలన ఆ సినిమాలన్నీ ఒకేరకంగా ఉంటున్నాయనేది నా ఉద్దేశం. 

కొత్తగా వచ్చిన హీరోలంతా దర్శకుడి పనిలో జోక్యం చేసుకుంటున్నారు. ఫంక్షన్స్ లో ఇష్టానుసారం మాట్లాడుతూ ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తున్నారు. అర్జున్ గారు అన్నట్టుగా చాలామంది నిర్మాతలు .. చాలామంది హీరోల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. యంగ్ హీరోలంతా ఈ పద్ధతిని మార్చుకోవలసిన అవసరం ఉంది. విష్వక్ సేన్ చేసిన పని అర్జున్ గారికి మాత్రమే కాదు .. నిర్మాత అనే ప్రతి ఒక్కరికీ .. దర్శకుడు అనే ప్రతి ఒక్కరికీ కూడా అవమానమే" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News