depawali: నేపాల్ లో ఐదు రోజుల దీపావళి

  • నాలుగు రోజులు పశువులు, పక్షులకు పూజలు
  • చివరి రోజు అన్నాచెల్లెళ్ల వేడుక
  • యమధర్మరాజు దూతగా భావిస్తూ కాకికి పూజలు
  • కుక్కలకు పూలమాలలు వేసి వాటికి ఇష్టమైన ఆహారం పెడతారు
five days celebrations for diwali in nepal

దీపాల పండుగ దీపావళిని ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో జరుపుకుంటారు. రకరకాల పేర్లు, వేర్వేరు ఆచారాలతో చాలామంది ఈ పండుగ జరుపుకుంటారు. ఎక్కడైనా పండుగ ఒక్కరోజే కానీ నేపాల్ లో మాత్రం దీపావళిని ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. దీపావళిని నేపాల్ లో యమపంచక లేదా తీహార్ అని వ్యవహరిస్తారు. ఈ ఐదురోజుల పండుగలో జంతువులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో పూజ నిర్వహిస్తారు. ఈ పూజలలో భాగంగా కాకులు, కుక్కలతో పాటు పెంపుడు జంతువులను కొలుచుకుంటారు. పండుగ మొదటిరోజును కాగ్ తీహార్ (కాకుల పండుగ) అంటారు. యమధర్మరాజు దూతగా కాకిని కొలుస్తారు. కాకులను పూజించడం ద్వారా మృత్యువును దూరం చేసుకోవచ్చని, అదృష్టాన్ని పొందవచ్చని నేపాలీలు నమ్ముతారు. కాకులకు ఆహారంగా ధాన్యం, విత్తనాలను ఇండ్లపైనా, డాబాలపైనా ఉంచి మొక్కుతారు.

రెండోరోజు కుకుర్ తీహార్..
యమపంచకం రెండో రోజును కుకుర్ తీహార్ అంటారు. కుకుర్ అంటే కుక్క.. పండుగ రెండో రోజు కుక్కలను పూజిస్తారు. పూలమాలలు వేసి, తిలకం దిద్ది వాటికి ఇష్టమైన ఆహారం పెడతారు. పండుగ మూడో రోజు గై పూజగా వ్యవహరిస్తారు. యమపంచకంలో ఇది మఖ్యమైన రోజు.. గై పూజలో భాగంగా ఆవులను ముస్తాబు చేసి, వాటికి పూజలు చేస్తారు. కుంకుమ దిద్ది, పూలమాలలు వేసి వాటికి ఇష్టమైన తిండి పెడతారు. సాయంత్రం లక్ష్మీదేవిని పూజిస్తారు. 

పండుగ నాలుగవ రోజు పూజల విషయంలో నేపాల్ లో వేర్వేరు సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల యమపంచకం నాలుగవ రోజును గోరు తిహార్ గా వ్యవహరిస్తారు. ఆ రోజు గోవర్ధనగిరిని పూజిస్తారు. ఆవుపేడతో చిన్న కొండ ఆకారాన్ని తయారుచేసి దానికి పూజలు చేస్తారు. మరికొన్నిచోట్ల తమను తామే పూజించుకుంటారు. ఇక చివరిరోజు అన్నాచెల్లెళ్ల పండుగ (భాయ్ టికా) నిర్వహిస్తారు. తన అన్న, తమ్ముడు బాగుండాలని దేవుళ్లను ప్రార్థిస్తూ వాళ్ల నుదుట చెల్లెలు కుంకుమ బొట్టు పెడుతుంది. ఆ తర్వాత అన్నాచెల్లెల్లు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

More Telugu News