Kavita Chawla: ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’లో కోటి రూపాయలు గెలుచుకున్న గృహిణి.. చదివింది మాత్రం 12వ తరగతే!

  • ‘కౌన్‌బనేగా క్రోర్‌పతి-14’లో రూ. కోటి గెలుచుకున్న తొలి వ్యక్తిగా కవితా చావ్లాకు గుర్తింపు
  • ఇప్పుడు రూ. 7.5 కోట్లు గెలుచుకునేందుకు సిద్ధమవుతున్న కవిత
  • గెలిచిన డబ్బును తన కుమారుడి పైచదువులకు ఉపయోగిస్తానన్న కేబీసీ విజేత
  • కేబీసీ వేదిక పైనుంచి పొందే గౌరవం గొప్పదన్న కవిత
Kavita Chawla wins Rs 1 crore on Kaun Banega Crorepati 14

బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఓ టీవీలో నిర్వహిస్తున్న ‘కౌన్‌బనేగా క్రోర్‌పతి-14’లో పాల్గొన్న ఓ సాధారణ గృహిణి కోటి రూపాయలు గెలుచుకుని సంచలనం సృష్టించారు. ఈ సీజన్‌లో రూ. కోటి గెలుచుకున్న తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇంతా చేస్తే ఆమె చదువుకున్నది 12వ తరగతి కావడం మరో విశేషం. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన కవితా చావ్లా ఈ ఘనత సాధించారు. 

ఈ సందర్భంగా ‘ఇండియా టుడే’తో ఆమె మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. క్రోర్‌పతి షోలో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి కొల్హాపూర్ మహిళను కావాలని అనుకున్నానని, తన కల నిజమైందని సంతోషం వ్యక్తం చేశారు. ‘ఓ రికార్డు సాధించా’ అని సంబరపడ్డారు.

క్రోర్‌పతి 14 సీజన్‌లో కోటి రూపాయలు గెలుచుకోవడం అన్నది కేక్‌పైనున్న చెర్రీలాంటిదని కవిత అభివర్ణించారు. ఈ షోలో పాల్గొనేందుకు తను ఎలా సిద్ధమయ్యారో కూడా వివరించారు. ఇందులో పాల్గొనేందుకు తాను ప్రత్యేకంగా ఓ పుస్తకం కానీ, టీవీ చానళ్లు కానీ చూడలేదన్నారు. తన కుమారుడికి తాను ఏది బోధించినా ఆ పుస్తకాలనే తాను కూడా చదువుకునే దానినని, ముఖ్యమైన విషయాలను అండర్‌లైన్ చేసుకునే దానినని గుర్తు చేసుకున్నారు. తాను కేబీసీ షోను ఫాలో అయ్యేదానినని, కాబట్టి ఎటువంటి ప్రశ్నలు అడుగుతారో తనకు తెలుసని అన్నారు. తాను పుస్తకాలు చదవినప్పుడల్లా ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకునే దానినని కవిత చెప్పుకొచ్చారు. 

కేబీసీ షోలో గెలుచుకున్న సొమ్ముతో ఏం చేస్తారని ప్రశ్నించగా.. ఆ డబ్బును తన కుమారుడి చదువు కోసం ఉపయోగిస్తానని, దానికే తన తొలి ప్రాధాన్యమని అన్నారు. పై చదువుల కోసం అతడిని విదేశాలకు పంపుతానన్నారు. విదేశాల్లో చదువుకుని దేశానికి గర్వకారణంగా నిలవాలన్నది అతడి కల అని తెలిపారు. 

కేబీసీలో పాల్గొన్నది డబ్బుల గురించి మాత్రమే కాదు
డబ్బుల గురించి మాత్రమే తాను షోలో పాల్గొనలేదంటారు కవిత. ఆత్మగౌరవం కోసమే తానీ షోలో పాల్గొన్నట్టు చెప్పారు. ఈ వేదికపై నుంచి పొందే గౌరవాన్ని తాను చూశానని, తన ప్రదర్శన ద్వారా అది సంపాదించాలని కలలు గన్నానని పేర్కొన్నారు. ఇది చాలా విలువైనదన్నారు. కోటి రూపాయలు గెలుచుకుని ఇంటికి వెళ్తానన్న నమ్మకంతో తాను షోకు వచ్చానని పేర్కొన్నారు. ఈ షో ద్వారా ప్రతి ఒక్కరు కోటి రూపాయలు గెలుచుకోవాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. అది కూడా తన కలేనని అన్నారు. కాగా, రూ. కోటి గెలుచుకున్న కవిత ఇప్పుడు రూ. 7.5 కోట్లు గెలుచుకోవడానికి సమాయత్తమవుతున్నారు.

More Telugu News