Andhra Pradesh: మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకు?: ప‌వ‌న్ క‌ల్యాణ్

  • అచ్యుతాపురం, ప‌ల్నాడు జిల్లాలో రెండు హ‌త్యాచారాలు
  • రెండు చోట్లా గిరిజ‌న మ‌హిళ‌ల‌పైనే దారుణాలు
  • ఘ‌ట‌న‌ల‌పై తీవ్రంగా స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్
  • ప్ర‌భుత్వ ఉదాసీన తీరుతోనే నేరాలు పెరుగుతున్నాయ‌ని ఆగ్ర‌హం
pawan kalyan fires on ysrcp government over rape and murders

ఏపీలోని వైసీపీ స‌ర్కారుపై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోమారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకు? అంటూ ఆయ‌న రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, అఘాయిత్యాల‌కు సంబంధించి దేశంలోని తొలి 10 రాష్ట్రాల జాబితాలో ఏపీ ఉంద‌ని నేష‌న‌ల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్బీ) గ‌ణాంకాలు చెబుతున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయినా కూడా ప్ర‌భుత్వం మౌనంగా, ఉదాసీనంగా ఉండ‌టం మ‌హిళ‌ల‌కు శాప‌మ‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఉత్త‌రాంధ్ర‌లోని అచ్యుతాపురం సెజ్‌లో ఉపాధి నిమిత్తం వ‌చ్చిన ఓ మ‌హిళ‌పై... ప‌ల్నాడు జిల్లాలో నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద ఆశా వ‌ర్క‌ర్‌గా ప‌నిచేస్తున్న‌ మ‌రో గిరిజ‌న మ‌హిళ‌పై  జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌లు త‌న‌ను క‌ల‌చివేశాయ‌ని ఆయ‌న అన్నారు.

ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు త‌ర‌చూ చోటుచేసుకోవ‌డం, వాటిని ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డంతోనే మృగాళ్లు రెచ్చిపోతున్నార‌ని ప‌వన్ ఆరోపించారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నివాసానికి కూత‌వేటు దూరంలో ఓ యువ‌తిపై అత్యాచారం జ‌రిగితే... ఏడాది దాటినా నిందితుడిని ప‌ట్టుకోలేక‌పోవ‌డం రాష్ట్ర పోలీసు శాఖ అస‌మ‌ర్థ‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న ఆరోపించారు. ఇక హోం శాఖ మంత్రి ఈ ఘ‌ట‌న‌ల‌పై చుల‌క‌న భావంతో స్పందిస్తున్న తీరు కూడా నేరాల పెరుగుదల‌కు కార‌ణ‌మ‌ని ఆయ‌న ఆరోపించారు.

More Telugu News