Teenage Girl: రూ.30 వేల బాకీ కోసం మాజీ బాయ్ ఫ్రెండ్ ను కిడ్నాప్ చేసిన టీనేజి అమ్మాయి

  • విభేదాలతో విడిపోయిన జంట
  • మరో ప్రియుడ్ని చూసుకున్న అమ్మాయి
  • మాజీ ప్రియుడిపై పగ
  • కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
Teenage girl kidnaps ex boyfriend

కోల్ కతాలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. మాజీ బాయ్ ఫ్రెండ్ తన బాకీ చెల్లించలేదంటూ ఓ టీనేజి అమ్మాయి ఏకంగా అతడిని కిడ్నాప్ చేయించింది.  బెలియాఘటా ప్రాంతానికి చెందిన తమల్ అధికారి (22), కెస్తోపూర్ కు చెందిన ఆ టీనేజి అమ్మాయి (18) కొంతకాలం పాటు ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. వారిద్దరూ సఖ్యతతో ఉన్న సమయంలో తమల్ అధికారికి ఆమె రూ.30 వేలు ఇచ్చింది. ఆ డబ్బు చేతిలో పడిన తర్వాత అతడు తనను పట్టించుకోవడం మానేశాడని ఆమె ఆగ్రహంతో ఉంది. 

ప్రస్తుతం మరో యువకుడితో ప్రేమలో ఉన్న ఆ యువతి ఎలాగైనా మాజీ ప్రియుడి నుంచి ఆ బాకీ వసూలు చేయాలని నిర్ణయించుకుంది. "నిన్ను ఓసారి కలవాలని ఉంది" అంటూ తమల్ అధికారికి రాయబారం పంపింది. నిజమేనని నమ్మి వచ్చిన ఆ యువకుడిని తన ప్రస్తుత బాయ్ ఫ్రెండ్, అతడి స్నేహితుల సాయంతో కిడ్నాప్ చేసింది. భవానీపూర్ లేడీస్ పార్క్ సమీపంలోని ఓ గదిలో బంధించింది. తమల్ తండ్రి తపన్ (52)కు ఫోన్ చేసి డబ్బు తెస్తేనే అతడి కుమారుడ్ని వదిలిపెడతానని స్పష్టం చేసింది. 

మొదట లక్ష రూపాయలు డిమాండ్ చేసిన ఆ యువతి, చివరికి రూ.30 వేలు ఇస్తే చాలంది. అయితే, కిడ్నాప్ కు గురైన యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఆ 18 ఏళ్ల యువతిని, ఆమె ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ ని, అతడి ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. వారి బారి నుంచి తమల్ అధికారిని కాపాడారు.

More Telugu News