Assam: ఒక్కరూ పాస్ కాని పాఠశాలల మూసివేత.. అసోం నిర్ణయం

  • 34 పాఠశాలల్లో పాస్ రేటు సున్నా
  • మరో 68 పాఠశాలల్లో పాస్ అయిన వారు 10 శాతం లోపే
  • పాస్ కానప్పుడు పాఠశాలలు నిర్వహించడం ఎందుకన్న అసోం విద్యా మంత్రి
Assam govt to shut 34 schools as all students fail in Class 10

అసోం ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షల్లో ఒక్క విద్యార్థి పాస్ కాని పాఠశాలలను మూసివేయనుంది. ఇలాంటి పాఠశాలలు 34 వరకు ఉన్నాయి. ఇందులో చదివిన 1,000 మంది పదో తరగతి విద్యార్థుల్లో ఒక్కరు కూడా ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదు. 

దీంతో విద్యా శాఖ మంత్రి రనోజ్ పెగుకు తీవ్రంగా కోపం వచ్చింది. సున్నా ఫలితం వచ్చే పాఠశాలల కోసం పన్ను చెల్లింపుదారుల సొమ్ము తగలేయడం వ్యర్థమనే అభిప్రాయానికి వచ్చారు. ‘‘పాఠశాలల ప్రాథమిక విధి విద్యను బోధించడమే. ఒక పాఠశాల తన విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విధంగా భరోసా కల్పించలేనప్పుడు అటువంటి స్కూళ్లను నిర్వహించడంలో అర్థం లేదు. అటువంటి పాఠశాలలపై ప్రభుత్వం ప్రజాధనాన్ని వెచ్చించలేదు’’ అని మంత్రి పేర్కొనడం గమనార్హం. 

మంత్రి ఆవేదన వెనుక పాఠశాలల్లో బోధన తీరు ఎలా ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. అసోం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది పదో తరగతి పాస్ అయిన వారు 56.5 శాతంగానే ఉన్నారు. 34 పాఠశాలల్లో ఒక్కరూ పాస్ కాకపోగా, మరో 68 స్కూళ్లల్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతం 10 శాతంలోపే ఉంది.

More Telugu News