YS Sharmila: బంగారు బోనాలు సమర్పించిన షర్మిల, పీవీ సింధు

  • సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో ఘనంగా బోనాల వేడుకలు
  • ప్రతి ఏడాది వేడుకల్లో పాల్గొంటానన్న షర్మిల
  • బోనాల పండుగ అంటే ఎంతో ఇష్టమన్న సింధు
YS Sharmila and PV Sindhu offers Bonam to Ammavaru

హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో ఈరోజు బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని అమ్మవారి పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా లాల్ దర్వాజ అమ్మవారికి వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బంగారు బోనాలు సమర్పించారు. 

బోనాన్ని తీసుకొచ్చిన షర్మిల ఆలయం లోపలకు వెళ్లి, అమ్మవారిని దర్శించుకోలేదు. ఆలయం వరకు వచ్చి, బోనాన్ని లోపలకు పంపించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, అమ్మవారికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రతి ఏడాది బోనాల ఉత్సవంలో పాల్గొంటానని తెలిపారు.

మరోవైపు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పీవీ సింధు మాట్లాడుతూ, బోనాల పండుగ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి తాను ప్రతి ఏడాది వస్తానని తెలిపారు. అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇకపై కూడా ప్రతి ఏడాది బోనాల ఉత్సవాల్లో పాల్గొంటానని తెలిపారు.

More Telugu News