KTR: బీజేపీ నేత‌లంతా స‌త్యహ‌రిచంద్రులేనా!... ఐటీ, ఈడీ, సీబీఐ దాడుల‌పై కేటీఆర్ సెటైర్‌!

  • బీజేపీ నేత‌ల‌పై ఎన్ని దాడులు జ‌రిగాయ‌న్న కేటీఆర్‌
  • బీజేపీ నేత‌లంతా స‌క్ర‌మ మార్గంలో న‌డుస్తున్న‌ట్టేనా? అని సెటైర్‌
  • జ‌స్ట్ ఆస్కింగ్ పేరిట బీజేపీపై ట్వీట్ సంధించిన కేటీఆర్‌
ktr tweet on cbi and it and ed raids on opposition leaders

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స‌ర్కారు... విప‌క్షాల‌కు చెందిన నేత‌ల‌పై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు సీబీఐ, ఐటీ, ఈడీల‌తో దాడులు చేయిస్తోంద‌న్న విమ‌ర్శ‌లు చాలా కాలం నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీల‌కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసిన వైనం తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలో గ‌డ‌చిన 8 ఏళ్ల బీజేపీ పాల‌న‌లో ఎంత‌మంది బీజేపీ నేత‌ల‌పై సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు జ‌రిగాయని ప్ర‌శ్నిస్తూ టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ శ‌నివారం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. బీజేపీ నేత‌లే కాకుండా క‌నీసం వారి సంబంధీకులపైనైనా ఈ 8 ఏళ్ల కాలంలో ఎన్ని దాడులు జ‌రిగాయని కేటీఆర్ ప్ర‌శ్నించారు. 

అంటే... బీజేపీకి చెందిన నేత‌లంతా స‌త్యహ‌రిచంద్రులేనా? అని కూడా ఆయ‌న వ్యంగ్యాస్త్రం సంధించారు. బీజేపీకి చెందిన నేతలంతా స‌క్ర‌మ మార్గంలో న‌డుస్తున్న‌ట్లే క‌దా? అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ కు జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ ఓ కామెంట్‌ను కూడా త‌గిలించ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News