United States: అమెరికాలో మూడు చోట్ల కాల్పుల మోత.. 9 మంది మృతి

  • మూడు చోట్లా ముగ్గురు చొప్పున కాల్పులకు బలి
  • రెండు డజన్ల మందికి పైగా గాయాలు
  • వరుసగా ఒకదాని తర్వాత ఒకటి దాడులు
Nine dead in three mass shootings across United States

అమెరికాలో మరోసారి తుపాకులు నోళ్లు తెరుచుకున్నాయి. మూడు చోట్ల తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు డజన్ల మంది గాయాలపాలయ్యారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. 

ఫిలడెల్ఫియాలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ చివరికి కాల్పులకు దారితీసింది. ముగ్గురు చనిపోగా, 12 మందికి గాయాలయ్యాయి. భయంతో బార్ లో ఉన్న వారు బయటకు పరుగులు తీశారు.

టెనెస్సేలోని చట్టనూగలో కాల్పులకు ముగ్గురు మరణించగా, 14 మందికి గాయాలయ్యాయి. మరో ఘటనలో మిచిగాన్ రాష్ట్రం సగినావ్ లో తుపాకీ కాల్పులకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం వరకు నిందితులను గుర్తించలేకపోయారు. 

టెక్సాస్ రాష్ట్రం ఉవాల్డేలో ఇటీవలే ఓ బాలుడు పాఠశాలలో జరిపిన కాల్పులకు 21 మంది మరణించడం గుర్తుండే ఉంటుంది. న్యూయార్క్ లోని బఫెలో లో గ్రోసరీ స్టోర్ లో కాల్పులకు 10 మంది మరణించిన ఘటనలు ఇంకా మర్చిపోక ముందే తాజా దారుణాలు నమోదు కావడం గమనార్హం. అమెరికాకు ఈ సంస్కృతి ఎన్నాళ్లు ఇలా? అంటూ అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఇటీవల వ్యాఖ్యానించడం తెలిసిందే.

More Telugu News