Hetero: రూ.5,300 కోట్ల ఆస్తులతో ఎంపీగా రికార్డు సృష్టించనున్న హెటెరో అధినేత!

  • పార్థసారథిరెడ్డి పేరిట రూ.3,909 కోట్లు
  • కుటుంబ సభ్యులవి కూడా కలిపితే రూ.5,300 కోట్లు
  • నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న హెటెరో అధినేత
  • టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు వెళ్లనున్న పార్థసారథిరెడ్డి
With Rs 5300 crore assets Hetero chief set to be Indias richest mp record

టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కాబోతున్న ప్రముఖ పారిశ్రామికవేత్త, హెటోరో గ్రూపు (ఫార్మా) చైర్మన్ బండి పార్థసారథి రెడ్డి ఆస్తులు వింటే కళ్లు తేలేయాల్సిందే. ఆయన పేరిట రూ.3,909 కోట్లు ఉంటే, కుటుంబ సభ్యులవి కూడా కలుపుకుంటే మొత్తం రూ.5,300 కోట్ల సంపదకు ఆయన అధినేత. ఈ సంపదలో ఎక్కువ మొత్తం షేర్లు, హెటెరో గ్రూపులో పెట్టుబడుల రూపంలో ఉన్నాయి.

ఈ వివరాలను పార్థసారథి రెడ్డి రాజ్యసభ స్థానం కోసం దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. పార్థసారథి రెడ్డి ఎన్నిక లాంఛనప్రాయమే. ఎందుకంటే ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆయన ఎన్నిక ప్రకటించగానే, దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీగా పార్థసారథి రెడ్డి రికార్డు సృష్టించబోతున్నారు. 

బీహార్ కు చెందిన మహేంద్ర ప్రసాద్ (జనతాదళ్) రూ.4,070 కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్న ఎంపీగా 2021 వరకు రికార్డుల్లో పేరు ఉంది. 81 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో 2021 డిసెంబర్ లో మహేంద్రప్రసాద్ మరణించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మహేంద్ర ప్రసాద్ కూడా ఫార్మా అధినేతే. అరిస్టో ఫార్మాస్యూటికల్స్, మాప్రా లాబొరేటరీస్ కంపెనీలు ఆయనవే. 

మహేంద్ర ప్రసాద్ మరణం తర్వాత అత్యంత ధనిక ఎంపీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అయోధ్యరామిరెడ్డి రూ.2,577 కోట్ల ఆస్తులతో మొదటి స్థానానికి చేరుకున్నారు. ఇప్పుడు ఈ రికార్డు పార్థసారథి రెడ్డి సొంతం కానుంది.

More Telugu News