నౌకల కదలికలపై కఠిన చర్యలు.. ఇరాన్ నావికాదళం ఆడియో రికార్డింగ్ కలకలం!
- హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేసినట్లు ఇరాన్ నావికాదళం రేడియో ప్రకటన
- హెచ్చరికలను ధిక్కరించి నౌకలు ప్రయాణిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఐఆర్జీసీ హెచ్చరిక
- వాణిజ్య నౌకలపై దాడికి వచ్చిన ఇరాన్ డ్రోన్లను అమెరికా సైన్యం కూల్చివేత
- ఇరాన్తో ఆదివారం శాంతి ఒప్పందం ముగిశాకే జలసంధి తెరుచుకుంటుందని ట్రంప్ వెల్లడి
ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌక సిబ్బంది అందించిన ఆడియో రికార్డింగ్ ప్రకారం.. పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ పరిధిలో ఉన్న అన్ని నౌకలను ఉద్దేశించి ఐఆర్జీసీ హెచ్చరికలు జారీ చేసింది. "హర్మూజ్ జలసంధిని ప్రస్తుతం పూర్తిగా మూసివేయడం జరిగింది. ఈ జలసంధి గుండా ఎలాంటి నౌకల కదలికలు ఉన్నా వాటిని చాలా కఠినంగా ఎదుర్కొంటాం. మీ ఆరోగ్యం, భద్రత దృష్ట్యా, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హర్మూజ్ జలసంధి వైపు రాకుండా దూరంగా ఉండండి" అని ఆ రేడియో సందేశంలో ఇరాన్ స్పష్టం చేసింది.
ట్రంప్ శాంతి ఒప్పందం - డ్రోన్ల కూల్చివేత
ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఒక కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో ఆదివారం (జూన్ 14) ఒక శాంతి ఒప్పందం కుదరబోతోందని, ఆ ఒప్పందంపై సంతకాలు ముగిసిన వెంటనే హర్మూజ్ జలసంధిని తిరిగి తెరుస్తారని ట్రంప్ వెల్లడించారు. అయితే, మరోవైపు క్షేత్రస్థాయిలో ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది. హర్మూజ్ జలసంధిలోని వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ పంపిన పలు డ్రోన్లను తాము విజయవంతంగా కూల్చివేసినట్లు అమెరికా సైన్యం శుక్రవారం రాత్రి ప్రకటించింది.
అంతర్జాతీయ మారిటైమ్ ఆర్గనైజేషన్ (IMO) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జూన్ 11 నాటికి హర్మూజ్ జలసంధి, పశ్చిమాసియా పరిసర ప్రాంతాల్లో అంతర్జాతీయ నౌకలపై 46 దాడులు జరిగాయి. ఈ దాడుల వల్ల ఇప్పటివరకు 14 మంది అంతర్జాతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఒక చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో ముగ్గురు నావికులు మరణించగా, ఆ దాడిని తామే చేసినట్లు అమెరికా సైన్యం ఆ తర్వాత ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగబోయే శాంతి ఒప్పందం కోసం అంతర్జాతీయ వాణిజ్య వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.