Kolkata: ప్రకాశం జిల్లాలో భారీ దోపిడీ.. కారును అటకాయించి రూ. 3 కోట్లు దోచుకున్న దొంగలు

  • కోల్‌కతా నుంచి కర్ణాటకలోని హోసపేటెకు బయలుదేరిన బాధితులు
  • యడవల్లి అటవీ ప్రాంత సమీపంలో వారిని అడ్డగించిన దుండగులు
  • డబ్బులు దోచుకుని పరారీ
  • పొంతనలేని సమాధానాలు చెబుతున్న బాధితులు
Massive robbery in Prakasam district Rs 3 Cr Robbed

ప్రకాశం జిల్లా దోర్నాలలో సోమవారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. కారులో వెళ్తున్న వారిని అటకాయించిన దుండగులు కత్తితో బెదిరించి రూ. 3 కోట్లు దోచుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌కు చెందిన కాలురామ్, అరవింద్ కారులో కోల్‌కతా నుంచి కర్ణాటకలోని హోసపేటెకు బయలుదేరారు. 

సోమవారం అర్ధరాత్రి సమయంలో వీరి కారు దోర్నాల మండలం యడవల్లి అటవీ ప్రాంత సమీపానికి చేరుకుంది. అదే సమయంలో వారి కారును ఫాలో అవుతూ వచ్చిన మరో కారులోని దుండగులు బాధితుల కారును అడ్డగించారు. ఆ పక్కనే ఉన్న బలిజేపల్లి రహదారిలోకి కారును మళ్లించారు. కొంతదూరం వెళ్లాక కారులో ఉన్న వారిని కత్తితో బెదిరించి వారి వద్దనున్న రూ. 3 కోట్ల నగదును దోచుకున్నారు. అనంతరం ఆ కారు తాళం చెవులను చెట్లలోకి విసిరేసి వెళ్లిపోయారు. దీంతో బాధితులు కారును అక్కడే వదిలేసి కాలినడకన బయలుదేరారు. 

అదే సమయంలో అటువైపు వచ్చిన అటవీ సిబ్బంది కారును గుర్తించి బాధితులను అడిగి అసలు విషయం తెలుసుకున్నారు. నిన్న ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు రాబట్టారు. కారుపైనున్న వేలిముద్రలు సేకరించారు. కాగా, బాధితులు పొంతన లేకుండా సమాధానాలు చెబుతుండడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News