IPL 2022: ఆక‌ట్టుకోని చెన్నై బ్యాటింగ్‌... గుజ‌రాత్ ల‌క్ష్యం 134 ప‌రుగులు

  • 133 ప‌రుగులు చేసిన చెన్నై
  • హాఫ్ సెంచ‌రీతో మెరిసిన గైక్వాడ్‌
  • పొదుపుగా బౌలింగ్ చేసిన గుజ‌రాత్ బౌల‌ర్లు

వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఇప్ప‌టికే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ నుంచి అవుట్ అయిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆదివారం నాటి మ్యాచ్‌లో పెద్ద‌గా రాణించ‌లేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌ను కోల్పోయి కేవ‌లం 133 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. చెన్నై ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్(53) హాఫ్‌సెంచ‌రీతో మెరిసినా.. చెన్నై జ‌ట్టు గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరును చేయ‌డంలో విఫ‌ల‌మైంది. చెన్నై స్టార్ బ్యాట‌ర్ శివ‌మ్ దూబే ఈ మ్యాచ్‌లో డ‌కౌట్ అయ్యాడు. గైక్వాడ్‌కు తోడు నారాయ‌ణ్ జ‌గ‌దీశ‌న్ (39), మొయిన్ అలీ (21) ప‌రుగులు చేయ‌డంతో చెన్నై ఆ మాత్రం స్కోరు అయినా చేయ‌గ‌లిగింది.

ఇక గుజ‌రాత్ టైటాన్స్ బౌలింగ్ విష‌యానికి వ‌స్తే... కెప్టెన్ హార్దిక్ పాండ్యా స‌హా బౌల‌ర్లంతా పెద్ద‌గా వికెట్లు తీయ‌కున్నా... చెన్నై బ్యాట‌ర్ల‌ను ప‌రుగులు చేయ‌కుండా నిలువ‌రించ‌గ‌లిగారు. మొహ్మ‌ద్ ష‌మీకి 2 వికెట్లు ద‌క్క‌గా... ర‌షీద్ ఖాన్‌, జోసెఫ్‌, సాయి కిశోర్‌ల‌కు త‌లో వికెట్ ద‌క్కింది. మ‌రికాసేప‌ట్లో 134 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో గుజ‌రాత్ త‌న ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నుంది.

More Telugu News