Vishwak Sen: త‌న కొత్త సినిమాపై జ‌రుగుతోన్న‌ త‌ప్పుడు ప్ర‌చారంపై విష్వ‌క్సేన్ పోస్ట్

  • 'అశోకవనంలో అర్జున కల్యాణం' ఓటీటీలో కూడా విడు‌ద‌ల కానుంద‌ని ప్ర‌చారం
  • అందులో నిజం లేద‌ని చెప్పిన విష్వ‌క్సేన్
  • వెంట‌నే ఆ పోస్టులు డిలీట్ చేయాల‌ని రిక్వెస్ట్ 
vishwak sen post

విద్యాసాగర్‌ చింతా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'అశోకవనంలో అర్జున కల్యాణం' ఇటీవలే విడుదలైన విష‌యం తెలిసిందే. అయితే, ఈ సినిమా అప్పుడే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. సామాజిక మాధ్య‌మాల్లోనూ ఈ ప్ర‌చారం పెరిగిపోవ‌డంతో ఆ సినిమా హీరో విష్వ‌క్సేన్ స్పందిస్తూ అటువంటి వార్త‌ల‌ను డిలీట్ చేయాల‌ని సూచించారు. 

తన కొత్త సినిమా విజయం సాధించ‌డం ప‌ట్ల ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఇన్ స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. తాము ఇకపై మరిన్ని మంచి సినిమాలు తీసేలా త‌మకు ధైర్యాన్ని ఇచ్చార‌ని పేర్కొన్నాడు. త‌మ‌ సినిమా ఓటీటీ రిలీజ్‌ గురించి సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, ఓటీటీలో ఎప్పుడు రిలీజ్‌ కానుందో డేట్‌తో సహా చెప్పేస్తున్నారని వాపోయాడు.  

నిజానికి తామే ఇంకా ఓటీటీ రిలీజ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాడు. త‌నకు కూడా ఓటీటీ విడుద‌ల‌ డేట్‌ తెలియదని, తాము ఫిక్స్‌ అయిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తామ‌ని చెప్పాడు. త‌న కొత్త సినిమా ప్రస్తుతానికి సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోందని అన్నాడు. 

సోషల్ మీడియాలో కొంద‌రు చేసిన‌ పోస్టులపై వారందరికీ తాను చెప్పేది ఒక్కటేన‌ని, సినిమా థియేటర్‌లో చూస్తే వచ్చే అనుభవం ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని చెప్పాడు. దాన్ని మిస్ కావ‌ద్ద‌ని, అవాస్తవాలను ప్రచారం చేస్తే థియేటర్ లో సినిమా చూడాలనుకునేవారు సైతం ఓటీటీ విడుద‌ల‌ను దృష్టిలో ఉంచుకుని కొన్నిసార్లు సినిమా హాళ్లకు వెళ్ల‌కుండా వాయిదా వేసుకుంటార‌ని తెలిపాడు. వదంతులు వ్యాప్తి చేయకూడ‌ద‌ని విష్వ‌క్సేన్ కోరాడు.

More Telugu News