Kangana Ranaut: కంగనాను అరెస్ట్ చేయండి... 'పద్మశ్రీ' వెనక్కి తీసుకోండి: విపక్ష నేతల డిమాండ్

  • 1947లో వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం కాదన్న కంగనా
  • మోదీ పాలనలో స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్నామని వెల్లడి
  • మండిపడుతున్న బీజేపీయేతర పార్టీల నేతలు
  • స్వాతంత్ర్య సమరయోధులను అవమానించిందంటూ ఆగ్రహం
Opposition leaders demands Kangana arrest

ప్రధాని మోదీ హయాంలోనే భారత్ నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తోందని, 1947లో వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం కాదంటూ సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు బీజేపీయేతర రాజకీయ పక్షాలను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. భారత్ కు అసలైన స్వాతంత్ర్యం వచ్చింది 2014లో అంటూ ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల నేతలు మండిపడుతున్నారు. కంగనాను అరెస్ట్ చేయాలని, ఆమె నుంచి 'పద్మశ్రీ'ని వెనక్కి తీసుకోవాలని వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ స్పందిస్తూ, 'పద్మశ్రీ' వంటి పురస్కారాలు ఇచ్చేముందు సదరు వ్యక్తుల మానసిక, శారీరక స్థితిగతులను పరిశీలించాలని పేర్కొన్నారు. దేశ మర్యాదను, స్వాతంత్ర్య సమరయోధులను, జాతీయ నాయకులను కించపరిచేందుకు మరెవ్వరూ సాహసించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రనౌత్ నుంచి పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని అన్నారు.

కంగనా తన వ్యాఖ్యలతో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులను, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ల త్యాగాలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు, కంగనా వ్యాఖ్యలు దేశద్రోహంతో సమానమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

ఇక, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వాతంత్ర్య సమరయోధులను అవమానించిన కంగనాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చూస్తుంటే కంగనా మలానా క్రీమ్ (ఓ రకమైన మాదకద్రవ్యం)ను అధిక మోతాదులో పుచ్చుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు అనిపిస్తోందని అన్నారు.

More Telugu News