Kapil Dev: కోహ్లీ ఇంత బేలగా మాట్లాడతాడని అనుకోలేదు: కపిల్ దేవ్

  • న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి
  • తాము పిరికితనంతో ఆడామన్న కోహ్లీ
  • కోహ్లీ స్థాయికి తగిన మాటలు కాదన్న కపిల్ దేవ్
  • జట్టులో స్ఫూర్తి నింపాలని రవిశాస్త్రి, ధోనీలకు సలహా
Kapil Dev opines on Kohli post match comments

న్యూజిలాండ్ తో ఘోర పరాభవం అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, ఈ మ్యాచ్ లో తమను పిరికితనం ఆవహించిందని తెలిపాడు. ధైర్యంగా షాట్లు కొట్టేందుకు, తెగించి బౌలింగ్ వేసేందుకు తాము వెనుకంజ వేశామని అన్నాడు. మొత్తమ్మీద ఈ మ్యాచ్ లో ఏమంత ఆత్మవిశ్వాసంతో ఆడలేదని వెల్లడించాడు.

అయితే కోహ్లీ వ్యాఖ్యలపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోహ్లీ ఇంత బేలగా మాట్లాడతాడని అనుకోలేదని పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ స్థాయి ఆటగాడికి ఇది తగదని అన్నారు. మ్యాచ్ లు గెలిచేందుకు కోహ్లీ ఎంత కసితో ఉంటాడో అందరికీ తెలిసిందేనని, కానీ ఈ జట్టును, కోహ్లీ ఆలోచనా విధానాన్ని చూస్తుంటే ఏమాత్రం స్థాయికి తగ్గట్టుగా లేని విషయం వెల్లడవుతోందని కపిల్ దేవ్ విమర్శించారు.

డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్ల దృక్పథాన్ని ఒక్కసారిగా మార్చడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల నడుమ జట్టులో స్ఫూర్తి రగిలించేందుకు హెడ్ కోచ్ రవిశాస్త్రి, మెంటార్ ధోనీ తమ అనుభవాన్ని ఉపయోగించాలని కపిల్ సలహా ఇచ్చారు. వరుస ఓటముల పాలవుతున్న జట్టుపై విమర్శలు రావడం సహజమేనని, ఆటగాళ్లు అందుకు సంసిద్ధులుగా ఉండాలని సూచించారు.

More Telugu News