Uttar Pradesh: మత్తెక్కించే మాటలతో మైమరపించి.. 300 మంది నుంచి రూ. 20 కోట్లు దండుకున్న దంపతుల అరెస్ట్

  • వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మత్తెక్కించే మాటలు
  • ఆపై నగ్నంగా మార్చి వీడియో రికార్డు
  • వాటిని పంపి బ్లాక్ మెయిల్
  • రూ. 80 లక్షలు బదిలీ చేసిన ఓ కంపెనీ ఉద్యోగి
UP police busted honey trap gang

యువకులను లక్ష్యంగా చేసుకుని తియ్యని కబుర్లతో వారిని నగ్నంగా మార్చి ఆపై ఆ వీడియోలను చూపించి డబ్బులు దండుకునే ముఠాకు ఉత్తరప్రదేశ్ పోలీసులు సంకెళ్లు వేశారు. ఓ సీఏ కంపెనీ యజమాని ఫిర్యాదుతో ఈ ముఠా గుట్టు రట్టయింది. తమ ఉద్యోగి ఒకరు కంపెనీ ఖాతా నుంచి రూ. 80 లక్షలు బదిలీ చేసినట్టు ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఘజియాబాద్‌కు చెందిన భార్యాభర్తలు సప్నా గౌతమ్, యోగేశ్‌లు సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో ఇలాంటి దారులు ఎంచుకున్నారు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి ఇచ్చిన సలహాతో వీరు ఇలాంటి మోసాలు ప్రారంభించారు.

యువకులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం, మరికొందరు యువతులకు కూడా ఇందులో శిక్షణ ఇచ్చి ఇలాంటి పనులే చేయించడం వంటి పనులను సప్నా చూసుకుంటే, బాధితుల వివరాలు, వారి ప్రదేశం, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్లు సేకరించడం యోగేశ్ పని. ఈ ముఠా తొలుత ఓ అడల్ట్ వెబ్ సైట్ లో నమోదు చేసుకుంటారు. యువకుల ఫోన్ నంబర్లు సేకరించిన తర్వాత అక్కడి నుంచి ఆయా వ్యక్తులకు నగ్నంగా వీడియో కాల్స్ చేస్తారు. ఇందుకు నిమిషానికి రూ. 234 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో సగం వెబ్‌సైట్ నిర్వాహకులకు వెళ్లిపోతుంది.

అయితే, ఇదే సమయంలో.. ఇంతకంటే తక్కువకే తాము అందుబాటులో ఉంటామంటూ బాధితుల నుంచి వీరు ఫోన్ నంబర్లు సేకరిస్తారు. ఆపై వారిని నేరుగా వాట్సాప్, ఇతర మాధ్యమాల ద్వారా కాల్ చేస్తారు. తియ్యని మాటలతో వారిని మత్తులోకి దించుతారు. ఆపై వారిని కూడా నగ్నంగా మారాలంటూ బలవంతం చేసి ఆ వీడియోను రికార్డు చేస్తారు. ఆ తర్వాత అసలు పని మొదలుపెడతారు.

 ఆ వీడియోలను వారికి పంపించి అడిగిన మొత్తం ఇవ్వకుంటే ఇంటర్నెట్‌లో పెడతామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడతారు. ఇలా ఇప్పటి వరకు దాదాపు 300 మందిని మోసం చేసి రూ. 20 కోట్లకుపైగా ఈ ముఠా దండుకుంది. ముఠా సూత్రధారులైన భార్యాభర్తలతోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

More Telugu News