REET: రూ. 6 లక్షల విలువైన బ్లూటూత్ చెప్పులు ధరించి హైటెక్ కాపీయింగ్‌కు యత్నం.. ఐదుగురికి అరదండాలు

  • 31 వేల టీచర్ పోస్టులకు ఆర్ఈఈటీ నిర్వహించిన రాజస్థాన్ ప్రభుత్వం
  • మొత్తం 25 మందికి చెప్పులు విక్రయించిన ముఠా
  • గ్యాంగ్ లీడర్ కోసం గాలింపు 
5 held as 3 REET candidates found with slippers hiding bluetooth devices

ఉపాధ్యాయులై భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన వారు గాడితప్పారు. పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్‌కు ప్రయత్నించి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లారు. రాజస్థాన్ ప్రభుత్వం నిన్న రాష్ట్రవ్యాప్తంగా 31 వేల టీచర్ పోస్టులకు రాజస్థాన్ ఎలిజబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్స్ (ఆర్‌ఈఈటీ) నిర్వహించింది. నాలుగువేలకుపైగా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 16 లక్షల మందికిపైగా హాజరయ్యారు.

ఈ పరీక్షకు హాజరైన ముగ్గురు అభ్యర్థులు బ్లూటూత్ అమర్చిన 6 లక్షల రూపాయల విలువైన చెప్పులు ధరించి పరీక్షకు హాజరయ్యారు. బికనీర్‌లోని గంగాషహర్ ప్రాంతంలోని నయా బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ హైటెక్ కాపీయింగ్ బాగోతం వెలుగులోకి వచ్చింది. వారిచ్చిన సమాచారంతో పరీక్ష రాసేందుకు వచ్చిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

ఓ ముఠా నుంచి వీరు రూ. 6 లక్షల చొప్పున బ్లూటూత్ చెప్పులను కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. వివిధ జిల్లాలకు చెందిన 25 మందికి ఈ ముఠా బ్లూటూత్ చెప్పులు విక్రయించినట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న గ్యాంగ్ లీడర్ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

More Telugu News