Perni Nani: హెరాయిన్ పై చంద్రబాబుది తప్పుడు ప్రచారం: మంత్రి పేర్ని నాని

  • గుజరాత్ లో పట్టుబడ్డ డ్రగ్స్
  • హెరాయిన్ విలువ రూ.9 వేల కోట్లు
  • ఏపీ డ్రగ్స్ కు కేంద్రంగా మారిందన్న చంద్రబాబు
  • ఖండించిన మంత్రి పేర్ని నాని
  • టీడీపీ నేతలను తాలిబన్లుగా పేర్కొన్న నాని
Perni Nani condemns Chandrababu comments in drugs issue

ఏపీ ఇప్పుడు డ్రగ్స్ కు కూడా కేంద్రంగా మారిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర మంత్రి పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్ నుంచి విజయవాడకు డ్రగ్స్ రవాణా అవుతున్నాయన్న వార్తల్లో నిజంలేదని పోలీస్ అధికారులే ప్రకటించారని వెల్లడించారు.  చంద్రబాబుకు రాష్ట్రంపై ఏదైనా కోపం ఉంటే అది సీఎం జగన్ వరకే పరిమితం చేయాలని, ఏపీ ప్రజలపై అక్కసు వెళ్లగక్కవద్దని హితవు పలికారు. తప్పుడు ఆరోపణలు చేసి రాష్ట్ర పరువుప్రతిష్ఠలు మంటగలపవద్దని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని టీడీపీ నేతలను ఆంధ్రా తాలిబన్లుగా అభివర్ణించారు. విజయవాడలో భూఅక్రమాలకు పాల్పడే వీళ్లు గుజరాత్ లో పట్టుబడిన హెరాయిన్ పై మాట్లాడుతున్నారని పేర్ని నాని విమర్శించారు. చెన్నైకి చెందిన వ్యక్తి విజయవాడ అడ్రస్ ఇచ్చినంత మాత్రాన ఇక్కడ ఘోరాలు జరిగిపోతున్నట్టు భావించాలా? అని నిలదీశారు. ఓ వర్గం మీడియా విజయవాడలో దారుణాలు జరిగిపోతున్నట్టు రాస్తోందని ఆరోపించారు. ఎంత దుష్ప్రచారం చేసినా సీఎం జగన్ ను ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.

More Telugu News