YS Jagan: జగన్ వచ్చాక ఏపీలో నిరుద్యోగిత 3 నుంచి 16 శాతానికి పెరిగింది: చంద్రబాబు

  • యువజన, విద్యార్థి సంఘం నేతలతో చంద్రబాబు సమావేశం
  • యువత పోరాటానికి మద్దతు ఉంటుందని స్పష్టీకరణ
  • రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన
Chandrabau met with students leaders

ఏపీలో జగన్ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగిత 3 శాతం నుంచి 16 శాతానికి పెరిగిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నిన్న యువజన, విద్యార్థి సంఘం నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం కారణంగా రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు, ఉద్యోగాలు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. రాజధాని అమరావతిని నిలిపివేయడంతో పెట్టుబడులు, పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం రాష్ట్రానికి రూ.16 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రావాల్సి ఉందని, అవి కనుక వచ్చి ఉంటే కొత్తగా 30 లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ కేలండర్ ఓ బూటకమన్న చంద్రబాబు.. వలంటీర్ ఉద్యోగాల లెక్కలు చూపించి యువతను దారుణంగా మోసం చేస్తోందన్నారు. ఉద్యోగాల కోసం పోరాడుతున్న యువతపై అత్యాచార కేసులు పెట్టే స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్యపై  యువత పోరాటానికి తమ మద్దతు ఉంటుందని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు.

More Telugu News