GST: 20 నెలల తర్వాత ఈ నెల 17న జీఎస్టీ మండలి ప్రత్యక్ష సమావేశం.. పెట్రోలు, డీజిల్‌పైనే చర్చ!

  • డిసెంబరు 2019 తర్వాతి నుంచి ఆన్‌లైన్‌లోనే సమావేశాలు
  • పెట్రోలు, డీజిల్, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపైనే ప్రధానంగా చర్చ
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాన్ని వదులుకునేందుకు అంగీకరిస్తే సాధ్యం
GST Council meet on Friday

కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రత్యక్ష సమావేశాలకు స్వస్తి పలికిన జీఎస్టీ మండలి దాదాపు 20 నెలల తర్వాత ఈ నెల 17న (శుక్రవారం) ప్రత్యక్షంగా సమావేశం కాబోతోంది. 18 డిసెంబరు 2019 తర్వాతి నుంచి ఆన్‌లైన్‌లోనే ఈ సమావేశాలు జరుగుతుండగా, ఇప్పుడు తొలిసారి మండలి ప్రత్యక్షంగా సమావేశం కాబోతోంది.

పెట్రోలు, డీజిల్‌తోపాటు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం. నిజానికి పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయంలో కొంత కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇందుకు అవి అంగీకరిస్తేనే పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే వీలుంటుంది.

అయితే, ప్రభుత్వాలకు ఆదాయం తగ్గినప్పటికీ వినియోగదారులకు మాత్రం దీనివల్ల భారీ ప్రయోజనం చేకూరుతుంది. పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై జీఎస్టీ మండలి చర్చించి నిర్ణయం తీసుకోవాలని కేరళ హైకోర్టు జూన్‌లోనే మండలికి సూచించింది. అలాగే, కరోనా ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వంటి వాటికి పన్ను మినహాయింపులు కొనసాగించే అంశంపైనా జీఎస్టీ మండలి సమావేశంలో చర్చిస్తారని సమాచారం.

More Telugu News