Antony Blinken: ఆఫ్ఘనిస్థాన్ లో గత 20 ఏళ్లుగా పాకిస్థాన్ ఏం చేసిందో తేలాలి: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్

  • పాక్ తో సంబంధాలపై బైడెన్ సర్కారు సమీక్ష
  • ఆఫ్ఘన్ లో 20 ఏళ్లుగా అమెరికా సేనలు
  • అక్కడి ప్రభుత్వానికి మద్దతు
  • అదే సమయంలో తాలిబన్లకు పాక్ తోడ్పాటు
USA administrators to review Pakistan role

పాకిస్థాన్ తో తమ సంబంధాలను పునఃసమీక్షించాలని అమెరికా భావిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్ అంశంలో పాకిస్థాన్... అమెరికాను విభేదించేలా విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నట్టు తెలుస్తోందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. ఓవైపు తాలిబన్లకు ఆశ్రయం కల్పిస్తోందని, మరోవైపు అమెరికాతో ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణలో కలిసి నడుస్తోందని వివరించారు. ఆఫ్ఘనిస్థాన్ భవితవ్యానికి సంబంధించిన సవాళ్లతో పాకిస్థాన్ అంశం కూడా ముడిపడి ఉందని బ్లింకెన్ పేర్కొన్నారు.  

"రాబోయే కొన్నిరోజుల్లోనో, కొన్ని వారాల్లోనో మేం దీనిపై దృష్టి సారించనున్నాం. గత 20 ఏళ్లుగా ఆఫ్ఘన్ అంశంలో పాకిస్థాన్ ఏంచేసిందో తేలాలి. అంతేకాదు, రాబోయే రోజుల్లో పాకిస్థాన్ ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపైనా సమీక్ష చేపడతాం" అని స్పష్టం చేశారు.

ఆఫ్ఘనిస్థాన్ లో పీఠం ఎక్కిన తాలిబన్లతో పాకిస్థాన్ కు దృఢమైన సంబంధాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. గత 20 ఏళ్లుగా ఆఫ్ఘన్ లో ప్రభుత్వానికి అమెరికా అండదండలు అందించగా, అదే సమయంలో తాలిబన్లకు పాక్ వెన్నుదన్నుగా నిలిచినట్టు ఆరోపణలు వచ్చాయి. సరిగ్గా ఈ అంశంపైనే బైడెన్ సర్కారు పాక్ ను నిలదీయాలని భావిస్తోంది.

ఆసియా ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణ కోసం అమెరికా మిలియన్ల డాలర్లను కుమ్మరిస్తోంది. పాక్ భాగస్వామ్యంతో ఉగ్రవాద కార్యకలాపాల కట్టడికి తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే పాక్ ద్వంద్వ వైఖరిపై అమెరికా ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు బ్లింకెన్ వ్యాఖ్యలు వెల్లడిస్తున్నాయి.

More Telugu News