JNTU: కాకినాడ జేఎన్టీయూ గెస్ట్ హౌస్ లో కొత్త జంటకు శోభనం... విచారణకు కమిటీ ఏర్పాటు

  • వర్సిటీలో హనీమూన్ కలకలం
  • రెండ్రోజులు గడిపిన కొత్త జంట
  • అనుమతి లేకుండానే బస
  • ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు
Honeymoon at JNTU Kakinada campus

కాకినాడ జేఎన్టీయూ గెస్ట్ హౌస్ లో ఓ జంట రెండ్రోజుల పాటు హనీమూన్ జరుపుకున్న ఘటన కలకలం రేపింది. దీనిపై జేఎన్టీయూ వర్గాలు విచారణకు తెరదీశాయి. దీనిపై విచారణకు ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశాయి. హనీమూన్ కోసం యూనివర్సిటీ గెస్ట్ హౌస్ వినియోగించుకోవడాన్ని అధికార వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి.

దీనికి సంబంధించిన వివరాలను కాకినాడ జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.శ్రీనివాసరావు వెల్లడించారు. "వర్సిటీ గెస్ట్ హౌస్ లో రెండ్రోజుల పాటు బస చేసేందుకు జేఎన్టీయూ కాకినాడ ఉమెన్ ఎంపవర్ మెంట్ సెల్ డైరెక్టర్ స్వర్ణకుమారి అనుమతి పొందారు. కానీ ఆమెకు కేటాయించిన గదుల్లో ఓ జంట ఈ నెల 18, 19 తేదీల్లో హనీమూన్ జరుపుకుంది" అని వివరించారు.

ఈ నెల 20న ఓ వీడియో బయటికి వచ్చింది. గెస్ట్ హౌస్ లోని ఓ గదిని పూలతో అందంగా ముస్తాబు చేసి ఉండడం ఆ వీడియోలో కనిపించింది. దాంతో జేఎన్టీయూ వర్గాలు, విద్యార్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వర్సిటీ ఉన్నది ఇటువంటి వాటి కోసమా? అంటూ విమర్శలు వచ్చాయి.

ఆ కొత్త జంటే కాకుండా, వారి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఇతర రూముల్లో బస చేసినట్టు వర్సిటీ అధికారుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని వెల్లడైంది. కాగా ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా స్పందించారు. వర్సిటీ అతిథి గృహాన్ని హనీమూన్ వంటి కార్యక్రమాలకు ఉపయోగించుకోవడాన్ని ఆమె ఖండించారు.

More Telugu News