Jagan: టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన కోట్లాది రూపాయల భారాన్ని మేమే మోశాం: జగ‌న్

  • హక్కులు అందరికీ సమానంగా అందాలి
  • పాదయాత్రలో ఎన్నో అంశాలను గమనించా
  • టీడీపీ ప్రభుత్వం రూ.960 కోట్ల ధాన్యం బకాయిలు ఎగ్గొట్టింది
  • రూ.9వేల కోట్ల ఉచిత విద్యుత్‌, రూ.324 కోట్ల విత్తన బకాయిలు చెల్లించ‌లేదు
jagan slam tpd

విజ‌య‌వాడ‌లోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. హక్కులు అందరికీ సమానంగా అందాలని, తాము రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో ఎన్నో అంశాలను గమనించానని తెలిపారు.

వివిధ వర్గాల ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విష‌యాల‌ను తెలుసుకున్నాన‌ని అన్నారు. మ‌హిళ‌లు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా మరింత అభివృద్ధిని సాధించాల‌ని కోరుకుంటున్నార‌ని తెలిపారు.  త‌మ ప్ర‌భుత్వం వ్యవసాయ రంగానికి రూ.83వేల కోట్లు ఖర్చు చేసింద‌ని జ‌గ‌న్ చెప్పారు.  

రైతులకు పగటిపూట నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని,  ధాన్యం సేకరణ, కొనుగోళ్ల కోసం రూ.33వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం బకాయిలతో పాటు చెల్లించకుండా వదిలేసిన రూ.9వేల కోట్ల ఉచిత విద్యుత్‌, రూ.324 కోట్ల విత్తన బకాయిల భారాన్ని కూడా తామే మోశామ‌ని తెలిపారు.

త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో గమనించాలని చెప్పారు.  గ్రామ సచివాలయాల్లో 500పైగా పౌరసేవలతో సరికొత్త విప్లవానికి నాంది పలికామని చెప్పారు. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చామ‌ని జ‌గ‌న్ చెప్పారు.

రాష్ట్రంలో కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను మారుస్తున్నామని తెలిపారు. జగనన్న గోరుముద్ద ప‌థ‌కం ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. అమ్మఒడి ద్వారా రెండేళ్లలో రూ.13వేల కోట్లు ఇచ్చామ‌ని తెలిపారు.  5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారిని ఆరోగ్య శ్రీ కిందకు తీసుకొచ్చామ‌ని ఆయ‌న చెప్పారు.

More Telugu News