Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్న భారత పౌరులు వెంటనే స్వదేశానికి వచ్చేయండి: కేంద్రం

  • ఆఫ్ఘనిస్థాన్ లో కల్లోలభరిత పరిస్థితులు
  • క్రమంగా ప్రాబల్యం పెంచుకుంటున్న తాలిబన్లు
  • విమాన సర్వీసులు నిలిచిపోతాయంటున్న కేంద్రం
  • ఈలోపే భారతీయులు జాగ్రత్తపడాలని విజ్ఞప్తి
Central govt alerts Indians in Afghanistan should return immediately

ఆఫ్ఘనిస్థాన్ లో అరాచక శక్తుల ప్రాబల్యం పెరిగిపోతుండడం పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాలపై తాలిబన్లు పట్టు సాధిస్తుండడాన్ని భారత్ నిశితంగా గమనిస్తోంది. అందుకే, ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్న భారత పౌరులు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని స్పష్టం చేసింది.

హుటాహుటిన ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని ఆఫ్ఘన్ ను వీడాలని పేర్కొంది. ఆఫ్ఘన్ లో హింస క్రమంగా పెచ్చరిల్లుతోందని, త్వరలోనే విమాన సర్వీసులు నిలిచిపోవచ్చని, ఆ లోపే భారత పౌరులు త్వరపడి ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని భారత దౌత్య కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

"ఆఫ్ఘనిస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రావిన్సులు, నగరాల మధ్య విమాన సర్వీసులు నిలిపివేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో పర్యటిస్తున్న, నివసిస్తున్న, పనిచేస్తున్న భారతీయులెవరైనా ఉంటే స్వదేశానికి వెళ్లే విమాన సర్వీసులపై ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ ఉండాలి. విమాన సర్వీసులు నిలిచిపోకముందే భారత్ కు తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి" అని ఆఫ్ఘన్ లోని భారత దౌత్య కార్యాలయం పేర్కొంది.

అంతేకాదు, ఆఫ్ఘన్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత కంపెనీలకు కూడా పలు సూచనలు చేసింది. ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులను వెంటనే వెనక్కి పంపించేయాలని కోరింది.

More Telugu News