Raghu Rama Krishna Raju: జగన్ గురించి మాట్లాడితే అంతు చూస్తానని పార్లమెంట్ హాల్లో గోరంట్ల మాధవ్ బెదిరించారు: రఘురామకృష్ణ రాజు

  • ఇతర ఎంపీల ముందే అసభ్యంగా మాట్లాడారన్న రఘురాజు
  • సీసీకెమెరాల్లో విజువల్స్ ఉంటాయని వ్యాఖ్య
  • లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశానన్న రఘురాజు
Gorantla Madhav abused Raghu Rama Krishna Raju in parliament central hall

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. జగన్ కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే అంతు చూస్తానని పార్లమెంటు ఆవరణలో మాధవ్ తనను బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో రఘురాజు మాట్లాడుతూ, పార్లమెంటు సెంట్రల్ హాల్లో సహచర ఎంపీల ముందే తనతో అసభ్యంగా, నీచంగా గోరంట్ల మాధవ్ మాట్లాడారని రఘురాజు తెలిపారు. ఆ సమయంలో పలువురు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారని చెప్పారు. ఇతర ఎంపీలు ఉండటంతో తాను సంయమనం పాటించానని... ఆ తర్వాత లోక్ సభ స్పీకర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని తెలిపారు.

దీనికి సంబంధించిన విజువల్స్ సెంట్రల్ హాల్లోని సీసీ కెమెరాల్లో ఉన్నాయని... ఆ ఫుటేజీ చూస్తే గోరంట్ల మాధవ్ హావభావాలను వ్యక్తం చేస్తూ ఎలా మాట్లాడారో అర్థమవుతుందని చెప్పారు. ఆయన మాటలు వినిపించకపోయినా... ఆయన ఏం మాట్లాడారనే విషయాన్ని ఆయన బాడీ లాంగ్వేజ్ ద్వారా అర్థం చేసుకోవచ్చని అన్నారు.

గోరంట్ల మాధవ్ తో జగనే అలా మాట్లాడించారా? లేక జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు ఆయన అలా మాట్లాడారో తెలియదని రఘురాజు చెప్పారు. తన ఫిర్యాదు పట్ల స్పీకర్ సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం తనకుందని... ఒకవేళ తనకు న్యాయం జరగకపోతే ప్రధాని మోదీని కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

More Telugu News