CBI: వివేకా హత్యకేసులో అనుమానితుడు అదృశ్యం.. గాలిస్తున్న సీబీఐ

  • సునీల్ కుమార్ పేరును వెల్లడించిన వాచ్‌మన్ రంగయ్య
  • సీబీఐ అధికారులు వేధిస్తున్నారంటూ హైకోర్టుకు సునీల్
  • ఆ తర్వాతి నుంచి అదృశ్యం
  • సునీల్ సమీప బంధువును అదుపులోకి తీసుకున్న సీబీఐ!
viveka murder case suspect sunil kumar yadav missing

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అనుమానితుడైన సునీల్ కుమార్ యాదవ్ అదృశ్యమయ్యాడు. ఆయన కోసం సీబీఐ అధికారులు గాలిస్తున్నారు. విచారణ పేరుతో సీబీఐ అధికారులు తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ ఇటీవల ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. ఆ తర్వాతి నుంచి పులివెందులలోని సునీల్ కుమార్ ఇంటికి తాళం వేసి ఉంది. అప్పటి నుంచి సునీల్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులు కనిపించకుండా పోవడంతో బంధువుల ఇంటికి వెళ్లి ఉంటారన్న సమాచారంతో సీబీఐ అధికారులు గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో సునీల్ సమీప బంధువు అయిన యువరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. అనంతపురంలోని ఆయన బంధువుల ఇళ్లకు కూడా వెళ్లి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో సీబీఐ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కాగా, వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మన్ రంగయ్య ఇటీవల జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో సునీల్ కుమార్ యాదవ్ పేరును కూడా వెల్లడించాడు.

More Telugu News